చెరువులో వెంచర్..బొల్లారం వర్రకుంట చెరువును ఆక్రమించిన బీఆర్​ఎస్​ కార్పొరేటర్

చెరువులో వెంచర్..బొల్లారం వర్రకుంట చెరువును ఆక్రమించిన బీఆర్​ఎస్​ కార్పొరేటర్
  • గ్రేటర్​ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ పేరిట వెలుస్తున్న విల్లాలు
  • సర్వే నంబర్​ను మెన్షన్​ చేయకుండానే 
  • పర్మిషన్​ ఇచ్చిన హెచ్​ఎండీఏ
  • ఎన్జీటీలో కేసు ఫైల్​ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
  • హెచ్​ఎండీఏ, సంగారెడ్డి కలెక్టర్​కు ఎన్జీటీ నోటీసులు
  • నిర్మాణాలు ఆపకపోతే కూల్చేస్తామని వార్నింగ్​

 హైదరాబాద్​, వెలుగు: చెరువులోకి నీళ్లొచ్చే, పోయే దారులను మూసేసి.. మట్టితో చదును చేసి.. అందులో వెంచర్​ వేశారు. పెద్ద పెద్ద విల్లాలను కట్టేస్తున్నారు.  సర్వే నెంబర్​ మెన్షన్​ చేయకుండానే హెచ్​ఎండీఏ పర్మిషన్​ కూడా ఇచ్చేసింది. దీనిపై నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ)లో హ్యూమన్​ రైట్స్​ అండ్​ కన్జ్యూమర్​ ప్రొటెక్షన్​ సెల్​ ట్రస్ట్​ అనే స్వచ్ఛంద సంస్థ కేసు ఫైల్​ చేసింది. ఆ కేసుకు సంబంధించి హెచ్​ఎండీఏకు, సంగారెడ్డి కలెక్టర్​కు మూడ్రోజుల కింద ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవహారం బయటకు వచ్చింది. హైదరాబాద్​ శివారు బొల్లారంలోని వర్రకుంట చెరువుపై మియాపూర్​ బీఆర్​ఎస్​ కార్పొరేటర్​ ఉప్పలపాటి శ్రీకాంత్​ ప్రమోటర్​గా, డైరెక్టర్​గా ఉన్న సంస్థ చేపడ్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఇది.  

చెరువులో వెంచర్​!

మియాపూర్​ బీఆర్​ఎస్​ కార్పొరేటర్​ ఉప్పలపాటి శ్రీకాంత్​ ప్రమోటర్​, డైరెక్టర్​గా ఉన్న గ్రేటర్​ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు జిన్నారం మండలం బొల్లారంలోని సర్వే నెంబర్​ 82, 83ల్లో ఉన్న చెరువులో వెంచర్​ వేసినట్టు ఆరోపిస్తూ ఆ మధ్య హ్యూమన్​ రైట్స్​ అండ్​ కన్జ్యూమర్​ ప్రొటెక్షన్​ సెల్​ ట్రస్ట్​.. ఎన్జీటీలో పిటిషన్​ దాఖలు చేసింది. సర్వే నెంబర్లను మెన్షన్​ చేయకుండానే అక్కడ హౌసింగ్​ లే అవుట్​కు అనుమతిచ్చినట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించి ఫొటోలను కూడా ఆ సంస్థ ఎన్జీటీలో ప్రొడ్యూస్​ చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన ఎన్జీటీ సదరన్​ బెంచ్​.. హెచ్​ఎండీఏ, సంగారెడ్డి కలెక్టర్​కు నోటీసులు పంపింది. వెంటనే ఆ వెంచర్​ వద్ద సర్వే చేయించాలని ఆదేశించింది.

అంతేకాదు.. పర్యావరణ, అటవీశాఖలకు చెందిన ఇంటిగ్రేటెడ్​ రీజినల్​ ఆఫీసు అధికారులూ స్వతంత్ర దర్యాప్తు చేసి ఆగస్టు 4 కల్లా రిపోర్ట్​ను సమర్పించాలని ఆదేశాలిచ్చింది. హౌసింగ్​ లే అవుట్​కు ఇచ్చిన పర్మిషనుపై మరోసారి హెచ్​ఎండీఏ అధికారులు పరిశీలించుకోవాల్సిందిగా సూచించింది. చెరువును ఆక్రమించి విల్లా వెంచర్​ను నిర్మించడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువును పూడ్చేసి నిర్మాణాలు చేపట్టడమేంటని మండిపడింది. పిటిషనర్​ సమర్పించిన ఫొటోలను బట్టి చూస్తే.. ఆ చెరువు నామరూపాల్లేకుండా పోయిందని పేర్కొంది. చెరువుకు సంబంధించిన ఇన్​లెట్​, అవుట్​లెట్​ చానెళ్లను పూర్తిగా మాయం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీళ్లు వచ్చే, పోయే దారి లేకుండా చేశారని, హెచ్​ఎండీఏ కూడా ఆ విల్లాలకు అధికారికంగా పర్మిషన్లను ఇచ్చేసిందని ఎన్జీటీ ఫైర్​ అయింది. ఆ నిర్మాణాలను వెంటనే ఆపేయాలని, లేదంటే వాటిని కూల్చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇరిగేషన్​ శాఖ కట్టొద్దన్నా..

వర్రకుంట చెరువు ఆక్రమణకు గురి కావడంతో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ గతంలో అక్కడ తనిఖీలు చేసింది. చెరువు ఫుల్​ ట్యాంక్​ లెవెల్​లో కడుతున్న నిర్మాణాలన్నింటినీ ఆపేయాలంటూ అప్పుడే నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికను గ్రేటర్​ ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థకు కూడా పంపించినట్టు తెలుస్తున్నది. అయితే, కార్పొరేటర్​ శ్రీకాంత్​ సహా సంస్థ ప్రమోటర్లు.. తామేమీ చెరువును పూడ్చలేదని చెప్తున్నారు. తాము వెంచర్లు నిర్మిస్తున్న సర్వే నంబర్లలో చెరువు లేనే లేదంటున్నారు. సర్వే నంబర్లు 81, 83, 84లోనే చెరువు ఉన్నదని, తాము సర్వే నెంబర్​ 82లోని ఏడున్నర ఎకరాల్లో మాత్రమే వెంచర్​ నిర్మిస్తున్నామని అంటున్నారు. కోర్టుల్లోనే తేల్చుకుంటామని, లీగల్​ ఫైట్​ చేస్తామని చెప్తున్నారు. హెచ్​ఎండీఏ పర్మిషన్​ లెటర్​లో సర్వే నెంబర్​ లేకపోవడం టెక్నికల్​ ఎర్రర్​ అని పేర్కొన్నారు.