పట్టాలు ఉన్నా.. ఇళ్లను కూల్చడం అన్యాయం : ఆదర్శ్​రెడ్డి

పట్టాలు ఉన్నా.. ఇళ్లను కూల్చడం అన్యాయం : ఆదర్శ్​రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: పట్టాలు ఉన్నా పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బీఆర్ఎస్ పటాన్​చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్​ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇటీవల అమీన్​పూర్​ మండలం సుల్తాన్​పూర్​ గ్రామ సర్వే నంబర్​ 381 లో అక్రమ కట్టడాలని 23 నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. రెవెన్యూ అధికారుల చర్యలను ఖండిస్తూ ఆదర్శ్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుల్తాన్​పూర్​లో కూల్చిన ఇళ్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల కింద పట్టా సర్టిఫికెట్ పొందిన 21 మంది పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా తహసీల్దార్ కూల్చి వేయడం దారుణమన్నారు. 

ఇంటి నంబర్లు, టాక్స్​లు, కరెంట్ మీటర్లు అధికారులే ఇచ్చారని ఇప్పుడు అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందని, బాధితులకు అండగా బీఆర్ఎస్​ నిలబడుతుందన్నారు. సుల్తాన్​పూర్​ ఘటనలో అధికారుల అత్యుత్సాహంపై ఉన్నతాధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్​రెడ్డి, మాణిక్​ యాదవ్​, స్థానిక బీఆర్ఎస్​ నాయకులు పాల్గొన్నారు.