
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆ పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. హై షుగర్, లో బీపీతో బాధపడుతూ గురువారం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ను హాస్పిటల్లో పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై వారితో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగు నీరు, తదితర ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.