బండ్లు అమ్ముడుపోక షోరూంలు వెలవెల

బండ్లు అమ్ముడుపోక షోరూంలు వెలవెల

న్యూఢిల్లీ: ఇండియాలో ప్రస్తుతం వెహికల్స్(ఆటో మొబైల్స్‌‌) డీలర్లకు బీఎస్‌‌ 4 భయం పట్టుకుంది. వీరు మార్చి 31 లోపు తమ దగ్గరున్న బీఎస్‌‌ 4 స్టాక్‌‌ను వదిలించుకోవాలి. లేకపోతే ఏప్రిల్‌‌ 1 నుంచి బీఎస్‌‌ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌‌ జరగదు.  అంటే,  ఇంకా 20 రోజులే టైమ్‌‌ ఉంది.    అంతేకాదు, కరోనా దెబ్బతో కస్టమర్లు ఇటీవల షోరూమ్‌‌లకు రావడం తగ్గించేశారు. దీంతో ఈ నెల చివరిలోపు తమ దగ్గరున్న బీఎస్‌‌ 4 నిల్వలను అమ్మలేమోనని ఆటో మొబైల్స్‌‌ డీలర్లు వాపోతున్నారు.  వీటికి తోడు బ్యాంకులు కూడా బీఎస్‌‌ 4 వాహనాలకు ఫైనాన్స్‌‌ ఇవ్వలేమని నోటీసులు జారీ చేస్తున్నాయని అన్నారు. ఫిబ్రవరి చివరి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్‌‌ అసోషియేషన్‌‌(ఫాడా) తెలిపింది. కానీ మార్చి మొదటి వారంలో పరిస్థితులలో మార్పొచ్చిందని పేర్కొంది. బీఎస్‌‌ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్లకు వివిధ రాష్ట్రాల ట్రాన్స్‌‌పోర్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్స్‌‌ తమ సొంత డెడ్‌‌లైన్స్‌‌ను విధిస్తుండటంతో డీలర్లు బెంబేలెత్తుతున్నట్లు వెల్లడించింది. ఒకేసారి పలు సమస్యలు డీలర్లను చుట్టుముట్టాయని, దీంతో తమ దగ్గరున్న బీఎస్‌‌ 4 వాహనాలను అమ్మలేమని  భయపడుతున్నారని పేర్కొంది.

ప్రభుత్వంతో మాట్లాడాం కానీ..

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రోడ్డు ట్రాన్స్‌‌పోర్ట్‌‌, హైవే మంత్రిత్వ శాఖతో ఈ విషయాలపై మాట్లాడామని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే అన్నారు. కానీ ఇప్పటికే డీలర్‌‌‌‌ కమ్యునిటీలో నమ్మకం పడిపోయిందన్నారు.  బీఎస్‌‌ 4 వెహికల్స్‌‌కు ఫైనాన్స్‌‌ను అందించడంపై  కూడా బ్యాంకులతో మాట్లాడామని తెలిపారు. పంజాబ్‌‌, వెస్ట్‌‌బెంగాల్‌‌, చత్తీస్‌‌ఘడ్‌‌ వంటి రాష్ట్రాల నుంచి మాకు మద్ధతు లభిస్తోందని అన్నారు.  వీకెండ్‌‌లో కూడా రిజిస్ట్రేషన్‌‌  పూర్తి చేయడానికి చూస్తామని ఈ రాష్ట్రాలు హమీ ఇచ్చాయన్నారు. టూ వీలర్‌‌ డీలర్లు ఎక్కువగా నష్టపోతారని, వీరి దగ్గర 20–30 రోజుల నిల్వలు ఇంకా మిగిలిపోయాయని తెలిపారు . వీరితో పోల్చుకుంటే ప్యాసెంజర్‌‌‌‌, కమర్షియల్‌‌ వెహికల్‌‌ డీలర్లు కొంచెం మంచి పొజిషన్‌‌లోనే ఉన్నారని కాలే అన్నారు.  డెడ్‌‌ లైన్‌‌లోపు పాత నిల్వలను అమ్ముకోలేకపోతే డీలర్లు భారీగా నష్టపోతారని తెలిపారు. దీనిని నుంచి ఎలా బయటపడాలో ఒరిజినల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌(ఓఈఎం)తో చర్చిస్తామన్నారు.