బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో బానిసత్వంలోకి నెట్టబడ్డారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద కులాలకు టీఆర్ఎస్ పెద్దపీట వేయడంపై ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు సీట్లు ఖాళీ ఉండగా.. మూడు సీట్లు రెడ్లకు, ఒక సీటు వెలమ కులానికి కేసీఆర్ కేటాయించడంపై ఆయన ఫైర్ అయ్యారు. గత 75 ఏళ్లుగా దేశ రాజకీయం, అవకాశాలు, సంపద.. పెద్ద కులాల చుట్టే తిరుగుతోందన్నారు.
నేను ఏ కులాన్ని ద్వేషించను కాని నిజాలు మాట్లాడాలె. గత75 ఏళ్లుగా రాజకీయం-అవకాశం-సంపద అంతా so called పెద్ద కులాల చుట్టే తిరుగుతోంది.అసలు పెద్ద కులాలైన BC,SC,STలు ఎప్పడో బానిసత్వంలోకి నెట్టేయబడ్డరు. ఇప్పటికైనా, ఆత్మగౌరవమున్న నాయకులు పెత్తందార్ల పార్టీలనొదిలి,కాన్షీరాం బాట పట్టాలె? pic.twitter.com/Nj6bRDFHLO
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) November 17, 2021
తాను ఏ కులాన్నీ ద్వేషించనన్న ప్రవీణ్ కుమార్.. నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయం, అవకాశం, సంపద అంతా సోకాల్డ్ పెద్ద కులాల చుట్టే తిరుగుతోందన్నారు. అసలు పెద్ద కులాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో బానిసత్వంలోని నెట్టేయబడ్డారని ట్వీట్ చేశారు. ఆత్మగౌరవం ఉన్న నేతలు పెత్తందార్ల పార్టీలను వదిలి.. కాన్షీరాం బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్కు ‘పెద్ద కులాలకే పెద్ద పీట’ అంటూ వీ6 వెలుగు పత్రికలో వచ్చిన ఆర్టికల్ను జత చేశారు. కాగా, ఆరు ఎమ్మెల్సీ సీట్లలో నాలుగు సీట్లకు హుజూరాబాద్కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేసిన గులాబీ బాస్.. మిగిలిన రెండింటికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.