
- జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన
జగిత్యాల రూరల్, వెలుగు: చదువులో వెనకబడిందని తోటి విద్యార్థినిలు హేళన చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21), హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలోని ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ రిషి విమెన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కొద్దిరోజుల కింద నిత్యను ఇద్దరు ఫ్రెండ్స్ చదువులో వెనకబడుతుందని అందరిలో హేళన చేశారు.
దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఇటీవల నిత్య సొంతూరు వెళ్లింది. గత బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యానికి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. శుక్రవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి తిరుపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.