కామారెడ్డి జిల్లాలో ముందుకు కదలని మన బడి పనులు

కామారెడ్డి జిల్లాలో ముందుకు కదలని మన బడి పనులు
  •     జిల్లాలో 351 స్కూళ్ల ఎంపిక, 42 చోట్ల పనులే షురూ కాలే
  •     గత ప్రభుత్వంలో ఫండ్స్​కొరతతో మధ్యలో ఆగిన పనులు
  •     కొత్తగా వచ్చిన కాంగ్రెస్​గవర్నమెంట్​పై ఆశలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీవాడలోని హైస్కూల్​లో బిల్డింగ్​పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మన ఊరు మన బడి కింద రూ.30 లక్షల ఫండ్స్​తో క్లాస్​ రూమ్స్​ శాంక్షన్​అయ్యాయి. ఈ ఏడాది జూన్​లో పనులు షూరూ చేశారు. పునాదులు తీసి, పిల్లర్లు వేసి ఆపేశారు. 6 నెలలు కావొస్తున్నా తిరిగి పనులు ప్రారంభించడం లేదు. ఇక్కడ 6 నుంచి 10 వ క్లాస్​వరకు 175 మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. సరిపడా క్లాస్​రూమ్స్​లేక అవస్థల పడుతున్నారు.

కామారెడ్డి, వెలుగు : మన ఊరు మన బడి పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. పనులు షురువయ్యి ఏడాదిన్నర కావొస్తున్నా ఫండ్స్​కొరతతో ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కంప్లీటయిన పనులకు బిల్స్​రాక కాంట్రాక్టర్లు పనులు చేయించడం లేదు. కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉండగా, మరి కొన్ని చోట్ల అసలు షూరూ కాలేదు. సరిపడా క్లాస్​రూమ్స్ ​లేకపోవడం, కొన్ని చోట్ల బిల్డింగులు శిథిలం కావడం, మౌలిక వసతులు లేక స్టూడెంట్స్​కు ఇబ్బందులు పడుతున్నారు. 

కామారెడ్డి జిల్లాలో 1,011 గవర్నమెంట్​స్కూల్స్​ఉన్నాయి. మన ఊరు – మన బడి పథకం మొదటి విడతలో 351 స్కూళ్లను సెలక్ట్​ చేశారు. 234 స్కూళ్లకు​ఒక్కొక్కదానికి రూ.30 లక్షల లోపు, 117 స్కూళ్లకు రూ.30 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుందని, మొత్తంగా రూ.170 కోట్లు అవసరమని అంచనా వేశారు. 2022, ఫిబ్రవరిలో పనులకు శాంక్షన్​ ఇచ్చారు. రూ.30 లక్షల లోపు ఎస్టిమేషన్​ఉన్న స్కూళ్లకు  ప్రయార్టీ ఇచ్చి పనులు కంప్లీట్​చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. 

ఇదీ పరిస్థితి..

42 స్కూళ్లలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. 156 చోట్ల పనులు 70 నుంచి 80 శాతం సివిల్​ వర్క్స్​ కంప్లీటయ్యాయి. 44 స్కూళ్లకు మాత్రమే ఫర్నిచర్​ సప్లయ్​ చేశారు. 118 చోట్ల స్కూల్​ బిల్డింగ్​లకు కలరింగ్​ వేశారు. రూ.30 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసిన 45 స్కూళ్లల్లో పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. ఎన్ఆర్ఈజీఎస్​ కింద టాయిలెట్స్​నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఈ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఫండ్స్​ రాక మధ్యలోనే ఆపేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 62 కోట్ల మేర పనులు జరగగా, కేవలం రూ.41.93 కోట్ల బిల్లులు చెల్లించారు. రూ.20 ‌‌కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ​ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అసంపూర్తి పనులపై దృష్టి సారించి, త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులు చాలా చోట్ల కంప్లీట్​ అయ్యాయి. కొన్ని చోట్ల  పెండింగ్​లో ఉన్నాయి. పనులు జరిగిన వరకు ఇంజనీరింగ్​ ఆఫీసర్లు రికార్డులు చేశారు.  ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాం. పనులు మధ్యలో ఆపేసిన వారికి కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించాం.

– రాజు, డీఈవో, కామారెడ్డి