దృశ్యం సినిమాను తలపించిన ఘటన

దృశ్యం సినిమాను తలపించిన ఘటన

నవాబుపేట, వెలుగు: దృశ్యం సినిమా తరహాలో శవాన్ని మాయం చేయాలని చూసిందా భార్య. భర్తను చంపి డెడ్​బాడీని కొత్తగా కడుతున్న ఇంటి బాత్రూమ్​కింద పాతిపెట్టింది. కానీ పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. నిందితులను విచారించిన పోలీసులు గురువారం బాత్​రూం కింద తవ్వి డెడ్​బాడీని వెలికితీశారు. మహబూబ్​నగర్​జిల్లా నవాబుపేట మండలం దర్పల్లి గ్రామ పంచాయతీ మొరంబావి గ్రామానికి చెందిన రాములమ్మ తన భర్త చెన్నయ్యను  బంధువుల సాయంతో హత్య చేసింది. పొలం అమ్ముదామని భర్త ఒత్తిడి చేస్తుండడంతో ఈ దారుణానికి పాల్పడింది. నెల క్రితం హత్య చేయగా మృతుడి చెల్లెలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాములమ్మను విచారించగా కొడుకు, మరో ఇద్దరు బంధువుల సాయంతో భర్తను చంపిన విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన  సమాచారంతో బాత్​రూంలో పాతిపెట్టిన  డెడ్​బాడీని గురువారం తహసీల్దార్​రాజేందర్​రెడ్డి సమక్షంలో జేసీబీతో వెలికి తీశారు. పూర్తిగా డీకంపోజ్​ అయిన బాడీకి  పోలీసులు  పంచనామా నిర్వహించారు. అనంతరం ఫోరెన్సిక్​ డిపార్ట్​మెంట్​ హెచ్​ఓడీ డా.పార్వతి, డాక్టర్​సుచిత్​ఘటనా స్థలంలోనే పోస్ట్​మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.