
- సేన్, సాత్విక్పైనే ఆశలు
- నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్
- గాయంతో పీవీ సింధు దూరం
- బరిలో శ్రీకాంత్, సైనా, సాయిప్రణీత్, ప్రణయ్, సిక్కి
టోక్యో: బ్యాడ్మింటన్లో అత్యుత్తమ టోర్నీ అయిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్కు ఇండియా షట్లర్లు రెడీ అయ్యారు. దాదాపు దశాబ్ద కాలంలో స్టార్ షట్లర్ పీవీ సింధు లేకుండా తొలిసారి బరిలోకి దిగబోతున్నారు. మెగా టోర్నీలో గోల్డ్ సహా రికార్డు స్థాయిలో ఐదు మెడల్స్ నెగ్గిన సింధు చీలమండ గాయం కారణంగా సోమవారం మొదలయ్యే తాజా ఎడిషన్కు దూరమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న సింగిల్స్ స్టార్ లక్ష్యసేన్, డబుల్స్ హీరో సాత్విక్ సాయిరాజ్పైనే ఇండియా ఆశలు పెట్టుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ నెగ్గే క్రమంలో గాయం అవ్వడంతో సింధు ఈ టోర్నీ నుంచి విత్డ్రా అయింది. దాంతో, ఇప్పుడు పతకాలు నెగ్గే బాధ్యతను సింగిల్స్లో లక్ష్యసేన్తో పాటు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ తమ భుజాలపై వేసుకోవాలి. ఈ మెగా టోర్నీలో 2011 నుంచి ఇండియా కనీసం ఒక్క పతకం అయినా గెలుస్తూ వస్తోంది. గతేడాది మెన్స్ సింగిల్స్లో శ్రీకాంత్ సిల్వర్ నెగ్గి ఈ ఘనత సాధించి ఇండియా తొలి మెన్స్ షట్లర్గా నిలిచాడు. లక్ష్యసేన్ బ్రాంజ్తో మెప్పించాడు. కెంటో మొమోటా, జొనాథన్ క్రిస్టీ, ఆంథోని గింటింగ్ వంటి టాప్ ప్లేయర్లు లేకపోవడం వాళ్లకు కలిసొచ్చింది.
ఈ సారి మెన్స్ సింగిల్స్లో టాప్ ప్లేయర్లు విత్డ్రా అవ్వలేదు. పైగా, శ్రీకాంత్, సేన్, ప్రణయ్ ముగ్గురూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరితో పాటు 2019లో బ్రాంజ్ నెగ్గిన సాయి ప్రణీత్కు కఠిన డ్రా ఎదురైంది. తొలి రౌండ్లోనే లక్ష్యసేన్కు డెన్మార్క్ షట్లర్ విట్టింగస్తో సవాల్ ఎదురవనుంది. లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో పోరు ఆరంభించనున్న ప్రణయ్కు రెండో రౌండ్లోనే మొమోటా ఎదురుపడనున్నాడు. ఎన్గుయెన్ తో తొలి రౌండ్లో పోటీ పడే శ్రీకాంత్కు మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియాతో ముప్పు పొంచి ఉంది. మరో పార్శ్వంలో ఉన్న సాయి ప్రణీత్ తొలి రౌండ్లోనే నాలుగో సీడ్ చౌ తైన్ చెన్ తో కఠిన సవాల్ ఎదుర్కోనున్నాడు. ఇతర దేశాల ప్లేయర్లలో వరల్డ్ నంబర్ విక్టర్ అక్సెల్సెన్, డిఫెండింగ్ చాంప్ లో కీన్ యివ్, మూడో సీడ్ ఆండ్రెస్ ఆంటోన్సెన్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. కామన్వెల్త్కు ముందు శ్రీకాంత్, లక్ష్య, ప్రణయ్ థామస్ కప్లో ఇండియాకు చారిత్రక విజయం అందించారు. అదే ఆటను రిపీట్ చేస్తే వీరిలో ఒకరి నుంచి పతకం ఆశించొచ్చు.
సైనా గాడిలో పడేనా
సింధు గైర్హాజరీలో విమెన్స్ సింగిల్స్లో ఇండియాకు అవకాశాలు కనిపించడం లేదు. 2015 సిల్వర్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ ప్రస్తుతం ఫామ్లో లేదు. ఆమెతో పాటు 47వ ర్యాంకర్ మాళవిక పోటీలో ఉంది. 33వ ర్యాంక్కు పడిపోయిన సైనా ట్రయల్స్ దూరమై కామన్వెల్త్లో పోటీ పడలేకపోయింది. మునుపటి ఆటను చూపెట్టలేకపోతున్న ఆమె భారీ పోటీ ఉండే ఈ టోర్నీలో గాడిలో పడుతుందేమో చూడాలి. తొలి రౌండ్లో తను చెయుంగ్ యి (హాంకాంగ్)ని ఎదుర్కొంటుంది. రెండో రౌండ్లో తనకు సవాల్ విసురుతుందని అనుకున్న ఒకుహరా విత్డ్రా అయింది. ఈ చాన్స్ను సైనా సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి. 20 ఏళ్ల మాళవిక తొలి రౌండ్లో లైన్ క్రిస్టోఫర్తో పోటీ పడుతుంది.