
గువాహటి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండియా చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇండియా 44–45, 45–30, 45–33తో కొరియాపై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన క్వార్టర్స్ పోరులో ఇండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు.
ఇండియా ఎక్కువగా సింగిల్స్ ప్లేయర్లపై ఫోకస్ చేస్తే, కొరియన్లు బలమైన డబుల్స్ ప్లేయర్లను బరిలోకి దించారు. ఫలితంగా బాయ్స్ డబుల్స్లో భార్గవ్ రామ్ అరిగెలా–విశ్వ తేజ్ గొబ్బురు 5–9తో చావో హెయాంగ్ వూ–లీ హెయాంగ్ వూ చేతిలో ఓడారు. గర్ల్స్ డబుల్స్లో వెన్నెల–రేషికా 10–9తో చియోన్ హై ఇన్–మూన్ ఇన్ సియోపై నెగ్గారు. సింగిల్స్లో రౌనక్ చౌహాన్ 11–9తో చోయ్ అహ్ సియోంగ్ను ఓడించడంతో ఇండియా ఆధిక్యంలోకి వచ్చింది.
మిక్స్డ్ డబుల్స్లో ఆర్యన్ బిస్త్–లాల్రామ్సంగా 4–9తో లీ–చియోన్ చేతిలో కంగుతిన్నారు. గర్ల్స్ సింగిల్స్లో ఉన్నతి హుడా 15–9తో నెగ్గినా 44–45తో తొలి సెట్ను చేజార్చుకున్నారు. రెండో సెట్లో ఇద్దరు సబ్స్టిట్యూట్స్ను బరిలోకి దించిన ఇండియా 45–30తో గెలిచి రేసులో నిలిచింది. ఇక డిసైడర్లో లాల్రామ్సంగా–భార్గవ్ 9–4తో గెలవగా, వెన్నెల–రేషిక లీడ్ను 10 పాయింట్లకు పెంచారు. మూడో గేమ్లో చౌహాన్ 11–4తో చోయ్ గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచగా, మిక్స్డ్లో లాల్రామ్సంగా–బిస్త్, సింగిల్స్లో ఉన్నతి విజయం సాధించడంతో ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. మరో క్వార్టర్స్లో 45–35, 45–35తో చైనీస్ తైపీని ఓడించిన ఇండోనేసియాతో ఇండియా సెమీస్లో తలపడనుంది.