దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (CAA)తో పాటు, భారత్, పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు దేశ అంతర్గత విషయాలని స్పష్టం చేశారు. CAA గురించి తాను ప్రధాని మోడీతో చర్చించలేదని తెలిపారు. అయితే ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోడీ గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు.
కశ్మీర్ అంశంపై మాట్లాడిన ట్రంప్… ఆర్టికల్ 370 రద్దుపై తాను మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. ఇది కూడా భారత అంతర్గత విషయమన్నారు. కశ్మీర్ అంశంలో చాలా క్లిష్టమైన అంశాలున్నట్లు చెప్పారు. భారత్, పాకిస్తాన్ కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని తాను గతంలోనే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. పాక్ నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యపై భారత ప్రధాని మోడీ దీటుగా నిర్ణయాలు తీసుకోగలరని తెలిపారు ట్రంప్.