ఈవీలను పెంచుతున్న క్యాబ్​ కంపెనీలు

ఈవీలను పెంచుతున్న  క్యాబ్​ కంపెనీలు

న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఉబర్​, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ కంపెనీలు,  క్యాబ్ అగ్రిగేటర్‌‌లు కూడా ఈవీల సంఖ్యను భారీగా పెంచుతున్నాయి.  పోయిన నెలలో, టాటా మోటార్స్ ఉబర్​తో అతిపెద్ద ఒప్పందంపై సంతకం చేసింది. ఉబర్​ 25 వేల ఎక్స్‌‌ప్రెస్–-టి ఎలక్ట్రిక్ కార్లను దాని ప్రీమియం  రైడ్-షేర్  ఆఫర్‌‌లో   అందుబాటులోకి తెస్తోంది. ఈవీ అమ్మకాలు ఇప్పటివరకు వ్యక్తిగత  విభాగంలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ, షేర్డ్  మొబిలిటీ ప్లాట్‌‌ఫారమ్‌‌లు కూడా వీటి సంఖ్యను భారీగా పెంచుతున్నాయి. 

లెక్కలు జోర్దార్​..

  •     స్టార్టప్‌‌లు ఈ–కామర్స్‌‌లలో,  క్యాబ్​అగ్రిగేటర్‌‌లలో ఈవీలను భారీగా తీసుకొచ్చాయి. ఇవి ప్రస్తుతం భారతీయ రోడ్లపై 7,000–-8,000 ఈవీలను నడుపుతున్నాయి.
  •     గుర్గావ్ ఆధారిత  బ్లూస్మార్ట్ 3,500 ఎలక్ట్రిక్ కార్ల ను కొన్నది.
  •     ఆల్-ఎలక్ట్రిక్ ‘క్యాబ్ కో’ టాటా మోటార్స్ నుండి 10 వేల కార్లను కొంటున్నది. 
  •     బెంగళూరు ఎలక్ట్రిక్ వెహికల్ పైలట్ ప్రాజెక్ట్‌‌లో భాగంగా ఓలా సుమారు 1,000  కార్లను మోహరించింది.
  •     ఎవరెస్ట్ ఫ్లీట్ మార్చి చివరి నాటికి కరెంటు బండ్ల సంఖ్యను 500 నుంచి 1,000 వరకు పెంచాలని నిర్ణయించింది.
  •     లిథియం అర్బన్ టెక్ ఈ సంవత్సరంలోనే ఈవీలను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఇది 3,000 ఈవీలను నడుపుతోంది. 
  •     ఎవెరా క్యాబ్స్ దగ్గర ప్రస్తుతం 238 ఈవీలు ఉన్నాయి. ఈ సంవత్సరాంతానికి ఈ సంఖ్యను 2,000కి పెంచడానికి ప్లాన్లను రెడీ చేసింది.
  •     ట్రాన్స్‌‌పోర్ట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓరిక్స్ లీజింగ్ త్వరలో ఈవీల ఫ్లీట్​ను 600 నుండి 1,000 వరకు పెంచనుంది.
  •     లీజ్‌‌ప్లాన్ ఎలక్ట్రిక్ ఫ్లీట్‌‌ను  400 నుండి 20 శాతం పెంచాలని భావిస్తోంది

 

మనదేశంలో21 రాష్ట్రాలు తమ ఈవీ విధానాలను నోటిఫై చేశాయి. ఉత్తరప్రదేశ్,  తమిళనాడు ఇటీవలే ఈవీ పాలసీలను ప్రకటించాయి. మొత్తం 15 రాష్ట్రాలు ఈవీ కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నాయి.