మాస్క్, శానిటైజర్, హ్యాండ్వాష్ మన జీవితంలో భాగం అయిపోయాయి. కొవిడ్ను ఎదుర్కోవడానికి అవే ఆయుధాలు. ఇవి లేకుండా బయటకు వెళ్తే కొవిడ్ను మోసుకొచ్చినట్టే. కానీ, కనిపించకుండా
ఇంకో ప్రమాదం కూడా మనల్ని వెంటాడుతోంది. అదే ‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం’. మాస్క్లు పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం ఎంత ముఖ్యమో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. దీనివల్ల కూడా ‘కొవిడ్’ వ్యాప్తి జరుగుతుంది. అందుకే అందరిలో అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చింది ‘హైదరాబాద్ రోటరీ క్లబ్’.కొవిడ్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించారు. గుట్కాలు, పాన్లు నమిలి ఎక్కడంటే అక్కడ ఉమ్మడం వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. దీనివల్ల టీబీ కూడా సోకుతుంది. అందుకే ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నాయి. దీని కోసం అంటువ్యాధుల నివారణ చట్టం కింద జీవో జారీ చేశాయి. వీటిని పాటించేందుకు క్యాంపెయిన్ చేస్తోంది హైదరాబాద్ రోటరీ క్లబ్. ఆన్లైన్, ఆఫ్లైన్ల ద్వారా స్టాప్ ఇండియా స్పిట్టింగ్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది.
అవగాహన
చాలామంది ఎక్కడంటే అక్కడ ఉమ్ముతుంటారు. అలా చేయడం వాళ్లకు చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ ప్రస్తుతం ఇది ఒక మెడికల్ ఇష్యూగా మారింది అంటున్నారు డాక్టర్లు. బహిరంగంగా ఉమ్మడం ఆగిపోతే కొవిడ్ లాంటి అంటువ్యాధులను నివారించవచ్చు. దాంతోపాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని‘ హైదరాబాద్ రోటరీ క్లబ్’ సభ్యులు అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నివారించేందుకు ఈ క్లబ్ సభ్యులు ‘స్టాప్ ఇండియా స్పిట్టింగ్’ (#StopIndiaSpitting ) హ్యాష్ట్యాగ్ ను మొదలు పెట్టారు. దీని ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఉమ్మడం వల్ల జరిగే నష్టాలను, జబ్బులకు ఉమ్మికి మధ్య ఉండే సంబంధంను ప్రజలకు చెబుతున్నారు. బయట ఉమ్మేస్తూ ఎవరైనా కనిపిస్తే చూసీ చూడనట్టు వెళ్లకుండా.. వాళ్లకు జాగ్రత్తలు చెప్పడం ముఖ్యం అంటున్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఇటీవల ఓ వెబినార్ నిర్వహించారు. ఇందులో 150 మందికి పైగా మెంబర్స్ పాల్గొన్నారు.
స్టార్ట్ అయింది ఇలా...
స్టాప్ ఇండియా స్పిట్టింగ్ క్యాంపెయిన్ మొదట బెంగళూర్లో స్టార్ట్ అయింది. ‘ఓడెట్ కాట్రాక్’ అనే యాభై ఐదు ఏళ్ల వయసున్న ఆమె ఈ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టింది. పదేళ్ల కిందట ఆమె ఒక రోజు ట్రెయిన్లో వెళ్తోంది. డెస్టినేషన్ రాగానే దిగుతుంటే ఎవరో గుట్కాను ఉమ్మారు. అది అనుకోకుండా తలపై పడింది. దీంతో ఆమె వారం, పది రోజులు అనారోగ్యం బారిన పడింది. అనారోగ్యమే కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడింది. అలాంటి వాటివల్ల ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని ‘స్టాప్ ఇండియా స్పిట్టింగ్’ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. బెంగళూర్లోని ఆర్గనైజేషన్స్తో కలిసి పని చేసింది. బహిరంగంగా ఎక్కడా ఉమ్మివేయమని ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత 41వేల మంది సంతకాలు తీసుకుంది. ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకున్న ఎన్నో ఎన్జీవోలు వాళ్ల ఏరియాల్లో మొదలు పెడుతున్నాయి. అట్లా ఈ ప్రచారం హైదరాబాద్కు చేరింది.
మీరూ పాల్గొనొచ్చు
స్టాప్ ఇండియా స్పిట్టింగ్ క్యాంపెయిన్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. బహిరంగ ప్రదేశాల్లో వేరేవాళ్లు ఉమ్మివేయడం వల్ల మీకు ఎదురైన అనుభవం గురించి, మీరు అలాంటి వాళ్లను ఆపినప్పుడు వాళ్లెలా రెస్పాండ్ అయ్యారు. వంటి విషయాలను వీడియోల ద్వారా పంపించొచ్చు. ఆ వీడియోలతో పాటు మీ పేరు, ఊరు... పిల్లలైతే క్లాస్, స్కూల్ వివరాలతో stopindiaspitting@gmail.com కు మెయిల్ చేయండి. క్యాంపెయిన్లో పాల్గొనండి. - వినోద్ మామిడాల
మంచి రెస్పాన్స్ ఉంది..
స్టాప్ ఇండియా స్పిట్టింగ్ గురించి ఈమధ్య తెలిసింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశామంటున్నారు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ సురేశ్. ‘బహిరంగంగా ఉమ్మివేయడంపై ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేదు. దీనిపై క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. హైదరాబాద్లోని 34 రోటరీ క్లబ్లు ఇందులో పాల్గొంటున్నాయి. మాకు ఉన్న యూత్ వింగ్స్తో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. డస్ట్ బిన్స్ ఏర్పాటు గురించి, టిష్యులు వాడటం గురించి త్వరలోనే జీహెచ్ఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేయబోతున్నాం. ఇప్పుడిప్పుడే సిటీలో మా క్యాంపెయిన్ మొదలైంది. గ్రౌండ్లెవల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. దీని గురించి ప్రజల్లో అవగాహన వస్తే కరోనా లాంటి అంటువ్యాధులను కొంతైనా నివారించవచ్చు’ అంటున్నారాయన.