రాజధానులు మార్చుడు మామూలే…

రాజధానులు మార్చుడు మామూలే…

రాజధానుల్ని మార్చడమనేది ఎప్పట్నుంచో ఉన్నదే. ఒకప్పుడు బ్రిటన్​, డచ్​, స్పానిష్, బెల్జియం దేశాల పాలనలో ఉన్న ప్రాంతాలు ఇండిపెండెన్స్​ తెచ్చుకున్నాక సొంత కేపిటల్​ సిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశంలోకూడా అలాంటి మార్పు జరిగింది. అయితే, బ్రిటిషర్ల పాలనలోనే మార్పు జరగడంవల్ల మనకంతగా తెలియలేదు.

ఇండియా కేపిటల్​గా మొదట్లో కలకత్తా ఉండేది. ఈస్టిండియా కంపెనీ మన దేశంలో స్థిరపడ్డాక 1772 నుంచి కలకత్తా రాజధానిగా పాలించేది. ఆ తర్వాత రోజుల్లో బ్రిటిష్​ రాచరికపు పాలనలోకి వెళ్లి, 1911 వరకు అక్కడి నుంచే గవర్నమెంట్​ పనిచేసేది. 1911లో ఢిల్లీని కొత్త కేపిటల్​గా చేసుకుని అడ్మినిస్ట్రేషన్​ని మార్చేశారు. 1931లో ప్రస్తుతమున్న న్యూఢిల్లీకి మారింది. అలాగే, ఇండియా వాతావరణంవల్ల సిమ్లాకి వేసవిలో వెళ్లిపోయేవారు. 1850 నుంచి 1947 వరకు సిమ్లా నగరం సమ్మర్​ కేపిటల్​గా పనిచేసింది.

లాగోస్ టు అబూజా

నైజీరియా రాజధానిగా మొదట్లో లాగోస్​ ఉండేది. ఒక పద్ధతి లేకుండా అడ్డగోలుగా నగరం పెరిగిపోయింది. అలాగే, ఆ ప్రాంతంపై హక్కు కోసం అక్కడి తెగలు తరచు దొమ్మీకి దిగేవి. ఈ పోరాటాలతో ప్రభుత్వం విసిగిపోయింది. ఒక న్యూట్రల్​ ప్రదేశంకోసం వెదికి, అబూజాని ఎంచుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క తెగవాళ్లు తమదిగా క్లెయిమ్​ చేసుకోరు. అదీగాక, దేశం మధ్యలో అబూజా ఉంటుంది. 1980లో నిర్మాణం మొదలెట్టి, పదేళ్లలో పూర్తి చేశారు.  1991 నుంచి నైజీరియాకి కొత్త రాజధానిగా అబూజా మారింది.

ఆల్మటి టు నూర్సుల్తాన్

1991లో సోవియట్​ యూనియన్​ నుంచి విడిపోయాక కజక్​స్థాన్​ కేపిటల్​గా ఆల్మటి ఉండేది. ఆ నగరం ఇరుకుగా ఉండడమే కాకుండా, భూకంపాల ప్రభావం బాగా ఎక్కువ. మరోపక్క చైనా బోర్డర్​ ఉండడంతో కజక్​స్థాన్​లో పాలనకు పొలిటికల్​గా చాలా ఇబ్బంది ఏర్పడింది. దాంతో 1997లో ఆస్థానా నగరాన్ని కొత్త కేపిటల్​ చేసుకున్నారు. కజక్​స్థాన్​ను ఎక్కువ కాలం పరిపాలించిన ప్రెసిడెంట్​ నూర్​ సుల్తాన్​ నజర్​బయేవ్​ పేరుమీద ఆస్థానాని నూర్​–సుల్తాన్​గా పేరు మార్చుకున్నారు.

రియో డి జెనీరో టు బ్రసీలియా

ఎన్నో ఏళ్లపాటు బ్రెజిల్​కి రియో డి జెనీరో రాజధానిగా ఉండేది.  క్రమంగా కిక్కిరిసిపోయేసరికి, కేవలం అడ్మినిస్ట్రేషన్​కోసమే కొత్త కేపిటల్​ అవసరమైంది. రియో డి జెనీరోకి 1,100 కిలోమీటర్ల దూరంలోని  బ్రసీలియా తగిన ప్రదేశంగా ఖాయం చేశారు.  ఆర్కిటెక్ట్​లు, ఇంజినీర్లు, సిటీ ప్లానర్లు కలిసికట్టుగా ప్లాన్​ రూపొందించారు. 1960లో బ్రసీలియాని కొత్త రాజధానిగా తయారైంది. ఎక్కడా కన్​ఫ్యూజన్​ లేకుండా బ్లాక్​లవారీగా ప్లాన్​ చేశారు.  ఆర్కిటెక్చర్​ రీత్యా దీనిని వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్​గాయునెస్కో  గుర్తించింది.

రంగూన్ టు నేపిటావ్

ఒకప్పటి రంగూన్ నగరంతో మన తెలుగువాళ్లకు బాగా అనుబంధముంది. బర్మా (మయన్మార్)కి ఇదే ఎన్నో ఏళ్లపాటు కేపిటల్​. 2005లో అక్కడి మిలిటరీ పాలకులు రంగూన్​కి 320 కిలోమీటర్ల దూరంలోని నేపిటావ్​కి రాజధానిని మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనే దానికి సరైన కారణం లేదు. కొందరు చెప్పడమేమిటంటే, కేపిటల్​ని గనుక మార్చకపోతే విదేశీ దాడులు జరిగే ప్రమాదముందని జ్యోతిషుడు చెప్పడంతో మార్చేశారట!​