కార్లు కాస్ట్‌‌లీ అయినై.. అందుకే కొనట్లే

కార్లు కాస్ట్‌‌లీ అయినై.. అందుకే కొనట్లే

న్యూఢిల్లీ : కార్లు కాస్ట్‌‌లీగా ఉన్నాయని.. కొనగలిగే ధరల్లో ఇవి దొరకడం లేదని.. అందుకే ప్రజలు కార్లను కొనడం తగ్గించారని మారుతీ ఛైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ తెలిపారు. కొత్త కార్లలో ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అమర్చాలనే నిబంధనలతో కార్లు కాస్ట్‌‌లీగా మారాయని చెప్పారు. దీంతో ఎంట్రీ లెవల్ ఫోర్ వీలర్స్ కూడా కొనగలిగే స్థాయిలో కాకుండా ఖరీదైనవిగా మారాయన్నారు. వాటిని మెయింటైన్ చేయడం కష్టంగా ఉందని చెప్పారు. కార్ల అమ్మకాలు చరిత్రాత్మక స్థాయిలకి పడిపోవడంపై స్పందించిన భార్గవ.. పెట్రోల్, డీజిల్‌‌పై ఉన్న పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తోన్న రోడ్డు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కార్ల కొనుగోలుదారులకు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని తాత్కాలికంగా తగ్గించడంతో పెద్దగా తేడా ఏమీ ఉండదని చెప్పారు.

టూవీలర్ వాడే వారు ఫోర్ వీలర్‌‌‌‌లోకి అప్‌‌గ్రేడ్ కావాలనుకుంటున్నారని, కానీ వారి ఫైనాన్సియల్ సామర్థ్యంతో మారలేకపోతున్నారని మారుతీ ఛైర్మన్ అన్నారు. ఆల్టో అమ్మకాలు 50 శాతం క్రాష్ అయిన సంగతి తెలిసిందే. సేఫ్టీకి సంబంధించిన ఫీచర్లు, కొత్త ఎమిషన్ నార్మ్స్, ఇన్సూరెన్స్ కాస్ట్‌‌లు, తొమ్మిది రాష్ట్రాల్లో అదనపు రోడ్డు ట్యాక్స్‌‌లు కొనుగోలుదారుల సెంటిమెంట్‌‌పై ప్రభావం చూపుతున్నాయని భార్గవ వివరించారు. పలు రాష్ట్రాల్లో రోడ్డు ట్యాక్స్ ఎక్కువగా ఉండటంతో రూ.20వేల వరకు పెరిగాయి. దీంతో పాటు మరికొన్ని ఎంట్రీ లెవల్ కార్లు కాస్ట్ సుమారు రూ.55 వేల వరకు పెరిగింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు మాదిరి మన దేశంలో కూడా ఉండాలనుకోవడంపై భార్గవ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియన్ కారు కొనుగోలుదారు యూరోపియన్, జపనీస్ కాదన్నారు. ఇక్కడ తలసరి ఆదాయం 2,200 డాలర్లుంటే.. చైనాలో 10 వేల డాలర్లు, యూరప్‌‌లో 40 వేల డాలర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. వారితో మనల్ని ఎందుకు పోల్చడం అని మండిపడ్డారు. రెగ్యులేషన్స్ విషయానికొస్తే… ఇండియాలో మంచి రెగ్యులేషన్సే ఉన్నాయని చెప్పారు. ఇతర దేశాల ఆదాయాల ఆధారంగా కాకుండా… ఇండియన్ల ఆదాయం ఆధారంగా ప్రొడక్ట్ అఫర్డబులిటీపై శ్రద్ధ వహించాలని సూచించారు.