
- సరైన ప్రాతినిధ్యం లేదంటున్న ఆ వర్గం నేతలు..
- అగ్రకుల నేతలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు
- పార్టీని ‘రెడ్డి కాంగ్రెస్’లా మార్చేస్తున్నారని ఆరోపణలు
- ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారమేకేటాయించాలని విజ్ఞప్తులు
- ‘టీం ఓబీసీ’ పేరిట కాంగ్రెస్ నేతల గ్రూపు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో కులపోరు మరోసారి చర్చనీయాంశమవుతున్నది. పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతున్నదని ఆ వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో కూడా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. సమన్యాయం పాటించకుండా కేవలం అగ్రకులాల వారినే అందలం ఎక్కిస్తున్నారని, పార్టీని ‘రెడ్డి కాంగ్రెస్’లా మార్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు బీసీ నేతలు రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
జనరల్ సీట్లలోనూ కేటాయింపులు చేయాలన్న డిమాండ్ను లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా.. ‘టీం ఓబీసీ’ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేశారు. బీసీలకు ఎక్కువ టికెట్లను సాధించేందుకు ఆ గ్రూపులోని నేతలు సమావేశమయ్యారు.
జనరల్ స్థానాల్లోనూ అవకాశం ఇవ్వాల్సిందే..
తమకు కేవలం రిజర్వేషన్లోనే బీసీలకు టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతున్నదన్న వాదనను బీసీ నేతలు వినిపిస్తున్నారు. అందుకే ఈ సారి జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇచ్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో మూడు సీట్లకు తగ్గకుండా డిమాండ్ చేస్తున్నారు. కనీసం 40 సీట్ల కంటే ఎక్కువ కేటాయించాలని తేల్చి చెప్తున్నారు. పార్టీలో పెద్ద కులాల వారి పెత్తనం వల్ల బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదని, ఎనిమిదేండ్లుగా పార్టీ దిగజారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ కేటగిరీని పెద్ద కులాలకు ‘అనధికారిక రిజర్వ్డ్ కేటగిరీ’గా మార్చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని అంటున్నారు. ఇటు కొందరు ఎస్టీ సామాజికవర్గం నేతలు కూడా జనరల్ సీట్లలో పోటీకి సిద్ధమవుతుండడం గమనార్హం. తొలుత జనరల్ కేటగిరీ సీటునే పార్టీ నాయకత్వాన్ని అడుగుతామని ఓ ఎస్టీ సామాజికవర్గం నేత తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో గెలుపుపై ఏఐసీసీ ఫోకస్
రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఏఐసీసీ సీరియస్గా కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీలో ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తున్నది. దాంతో పాటు నేతలందరూ పార్టీ లైన్లోనే పని చేయాలంటూ సీనియర్లకు గట్టిగానే చెప్పింది.
ఉదయ్పూర్ డిక్లరేషన్ను పాటించాల్సిందే
వచ్చే ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉదయ్పూర్ డిక్లరేషన్ను పాటించాల్సిందేనని బీసీ నేతలు తేల్చి చెప్తున్నారు. ఉదయ్పూర్ డిక్లరేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అణగారిన వర్గాల వారికి సమాన ప్రాధాన్యం కల్పించాలని నిరుడు మేలో జరిగిన చింతన్ శిబిర్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ‘వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్’ఫార్ములానూ ఆమోదించింది. కుటుంబంలో మరో నేత యాక్టివ్గా ఉన్నా.. ఐదేండ్ల తర్వాతే టికెట్ ఇవ్వాలని డిక్లరేషన్లో పొందుపరిచింది. ఈ డిక్లరేషన్ను ఫాలో కావాలని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆహ్వానించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీసీ లీడర్ల డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకున్నది.
పెద్ద కులాల నేతల నుంచి సపోర్ట్ కరువు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల్లో బీసీలకు పార్టీ సీట్లను కేటాయించినా గెలిపించుకోలేకపోయారని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం పార్టీలోని పెద్ద కులాల నేతలేనని ఆరోపిస్తున్నారు. వారి నుంచి బీసీ లీడర్లకు సరైన సహకారం లేకపోవడం వల్లే ఆ స్థానాల్లో ఓడిపోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అగ్రకులాల నేతలు.. బీసీ క్యాండిడేట్లకు మద్దతు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలకు వినతి పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.