10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఐఏఎస్కు రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం !

10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఐఏఎస్కు రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం !

కష్టపడి సివిల్స్కు ప్రిపేర్ అయి ఐఏఎస్ అయినా కొందరు కాసుల కక్కుర్తి వల్ల ఆ కష్టానికి విలువ లేకుండా పోతుంది. 10 లక్షల లంచం తీసుకుంటూ ఐఏఎస్ ధీమన్ ఛక్మ పట్టుబడిన ఘటన ఒడిశాలో కలకలం రేపింది. కలహండి జిల్లాలో స్టోన్ క్రషర్ యజమాని నుంచి రూ. 10 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై 2025 జూన్‌లో ఒడిశా విజిలెన్స్ అధికారులు చక్మాను అరెస్టు చేశారు.

ధర్మగఢ్‌లోని తన ప్రభుత్వ క్వార్టర్స్‌లో డబ్బు తీసుకుంటుండగా అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. సోదాల్లో.. విజిలెన్స్ అధికారులు అతని ఇంట్లో లెక్కల్లో చూపని రూ. 47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్ట్ చేశారు. 

ధీమన్ చక్మాను సర్వీసు నుంచి సస్పెండ్ చేసి.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆ తర్వాత ఒరిస్సా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో అతనిపై అవినీతి కేసు ఉన్నప్పటికీ ఒడిశా ప్రభుత్వం ధిమాన్ చక్మాను తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా.. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. 2026 మే 21న ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి చేసిన ఐఏఎస్ అధికారిని ఆదాయం పెంచుకోవడానికి రెవెన్యూ శాఖలో నియమించినట్లు ఉందని కొందరు నెటిజన్లు ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బు సంపాదించుకోవడానికి అతనికి మరో అవకాశం లభించిందని నెటిజన్లు ఎద్దేవా చేశారు. ఎంత అవినీతిపరులైనా సరే.. ఐఏఎస్ ఉద్యోగాలకు ఢోకా లేదని మరికొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.