
న్యూఢిల్లీ: ఒక్క బ్రాండ్ను ఎండార్స్ చేస్తే చాలు.. సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. కంపెనీలు కూడా కోట్లు కుమ్మరించి మరీ సెలబ్రిటీలతో బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటూ.. కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటుంటాయి. కస్టమర్లు కూడా తమకు నచ్చిన సెలబ్రిటీ కనిపిస్తే చాలు, ఆ బ్రాండ్ను గుడ్డిగా కొనేస్తుంటారు. కానీ ఈ మధ్యన ఈ ట్రెండ్ మారింది. బ్రాండ్ ఎండార్స్మెంట్ చేసుకోవాలంటే, సెలబ్రిటీలు వెనకడుగు వేస్తున్నారు. బ్రాండ్ విశ్వసనీయతపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రియాంక చోప్రా నుంచి విరాట్ కోహ్లి వరకున్న సెలబ్రిటీలు పెద్ద పెద్ద పేచెక్లనే వదిలేసుకుంటున్నారు. సెలబ్రిటీలు వారి లైఫ్ స్టయిల్, కన్జంప్షన్కు ఫిట్ కాని బ్రాండ్స్ ఎండార్స్మెంట్ డీల్స్ను కుదుర్చుకోవడం లేదు. చాలా బ్రాండ్ల విషయంలో రెండో ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఫెయిర్నెస్ క్రీమ్ ఎండార్స్మెంట్లపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం జాతి వివక్ష ట్రెండ్గా మారింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లే ఫెయిర్నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేస్తున్నట్టు ప్రకటించాయి. హిందూస్తాన్ యూనీలివర్ కూడా ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ అనే పదం ఉండదని ప్రకటించింది.
మరోవైపు సెలబ్రిటీలు ఎండార్స్ చేసే ఫెయిర్నెస్ ప్రొడక్ట్లపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇండియన్ సెలబ్రిటీలు ఫెయిర్నెస్ క్రీమ్లను ఎండార్స్ చేయడం ఆపివేస్తారా? అని ఇటీవలే యాక్టర్ అభయ్ డియోల్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఫెయిర్నెస్ ప్రొడక్ట్లను ఎండార్స్ చేసే చాలా మంది సెలబ్రిటీలు, తమ ఎండార్స్మెంట్ డీల్స్ నుంచి డ్రాపవుట్ అయ్యారు. పెద్ద పెద్ద మొత్తాలను కూడా సెలబ్రిటీలు తిరస్కరిస్తున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుట్ కూడా రూ.15 కోట్లకు సంబంధించిన ఫెయిర్నెస్ క్రీమ్ ఎండార్స్మెంట్ డీల్ను వదులుకున్నట్టు తెలిసింది. కంగనా రనౌత్ కూడా రూ.2 కోట్ల ఫెయిర్నెస్ బ్రాండ్ డీల్ను, దాని కాన్సెప్ట్ అర్థం కాక వదులుకున్నట్టు రూమర్లు ఉన్నాయి. ప్రియాంక చోప్రా కూడా తన రంగు విషయంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక ఏడాది పాటు ఫెయిర్నెస్ క్రీమ్ను ఎండార్స్ చేసుకుని, ఆ తర్వాత దాన్ని ఆపివేసినట్టు పేర్కొంది. ఆ తర్వాత కూడా తనకు చాలా పెద్ద ఎండార్స్మెంట్ డీల్స్ వచ్చినప్పటికీ, వాటిని కూడా ఆమె తిరస్కరించింది.
కేసుల్లో ఇరుక్కున సెలబ్రిటీలు…
బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్న కొందరు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఆఫ్లైన్లో కూడా బ్రాండ్లకు, సెలబ్రిటీలకూ విమర్శలు, కేసులు తప్పడం లేదు. మలయాళం యాక్టర్ మమ్మూటి ఇందులేఖ స్కిల్ వైట్నింగ్ ప్రొడక్ట్ విషయంలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇందులేఖ వైట్నింగ్ సోపుకు మమ్మూటి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈ యాక్టర్ అప్పీరన్స్తో వైట్నింగ్ సోపుకు మరింత క్రెడిబులిటీ పెరిగిందని, కానీ దానిలో అన్ని తప్పుడు క్లయిమ్సే ఉన్నాయని ఫిర్యాదు దారుడు కే. ఛాతు చెప్పారు. సెలబ్రిటీలు సమాజానికి బాధ్యులుగాలన్నారు. షారుఖ్ ఖాన్ కూడా ఇమానీ క్రీమ్ విషయంలో లీగల్ వివాదంలో ఇరుక్కున్నారు.
For More News..