
ప్రభుత్వ పరిశీలనలో ప్రపోజల్
5-10 శాతం వాటాలు అమ్మే చాన్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) షేర్ల ధరలు ఇటీవల బాగా పెరిగిన నేపథ్యంలో వీటిలో 5 నుంచి 10 శాతం వాటాలను ఉపసంహరించుకోవాలన్న ప్రపోజల్ను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయమై త్వరలోనే పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ రాబోతున్నట్టు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్లలో కేంద్రానికి 80 శాతం వాటా ఉంది. రైట్స్ఇష్యూ వైపు మొగ్గు చూపని బ్యాంకుల కోసం ఆఫర్- ఫర్- సేల్ మార్గం ద్వారా వాటాలను విక్రయాన్ని నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బ్యాంకులకు మూలధనం అవసరమైతే, ఫాలో- ఆన్ పబ్లిక్ ఆఫర్ను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధానం ద్వారా ప్రభుత్వం కొంత వాటాను ఉపసంహరించుకుంటుంది. బ్యాంకు అదే నిష్పత్తిలో తాజా ఈక్విటీని జారీ చేస్తుంది. ఈ బ్యాంకులు తమ మూలధన సేకరణ ప్రణాళికలను సమర్పిస్తాయని, అసెస్మెంట్ల ఆధారంగా, ప్రతి బ్యాంకు కోసం రోడ్మ్యాప్ రూపొందిస్తారని అధికారి చెప్పారు, వాటా విక్రయ సమయం మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది జరగవచ్చు. గత ఒక సంవత్సరంలో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 34 శాతం రాబడిని ఇవ్వగా, బెంచ్మార్క్ నిఫ్టీ 6.4 శాతం రాబడిని ఇచ్చింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్లో 6.9 శాతం పెరుగుదల ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగ బ్యాంకుగా మారిన బ్యాంక్లో ప్రభుత్వం ఇప్పటికే తన వాటాలను ఉపసంహరించుకుంది.
సెప్టెంబరు క్వార్టర్ ఫలితాలు
2023–-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టరులో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,458 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది కాలంలో నమోదైన రూ. 960 కోట్లతో పోలిస్తే దాదాపు 52 శాతం ఎక్కువ. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సెప్టెంబరు క్వార్టర్లో రూ. 5,740 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన రూ. 5,083 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 919 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరు క్వార్టర్లో ఇది 4,317 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది.
ఈ క్వార్టర్లో మొత్తం ఆదాయం 32.8 శాతం పెరిగి రూ.4,317 కోట్ల నుంచి రూ.5,735 కోట్లకు చేరుకుంది.
గ్రాస్ఎన్పీఏలు 2.19 శాతానికి తగ్గాయి. మరో పీఎస్బీ యూకో బ్యాంక్ నికర లాభం 20 శాతం క్షీణించి రూ.402 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో బ్యాంక్ రూ.505 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 4,965 కోట్ల నుంచి రూ. 5,866 కోట్లకు పెరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.625 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.501 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సెప్టెంబర్ 2023తో ముగిసిన క్వార్టర్లో రూ. 1,135 కోట్లతో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.1,384 కోట్లకు చేరుకుంది.
గ్రాస్ఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 8.53 శాతం నుంచి 4.74 శాతానికి తగ్గాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుకు సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 31.7 శాతం పడిపోయి రూ. 189.9 కోట్లకు చేరింది. గ్రాస్ఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 9.67 శాతం నుంచి 6.23 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 2.24 శాతం నుంచి 1.88 శాతానికి తగ్గాయి. మొత్తం ఆదాయం రూ. 2,674 కోట్లు వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో 90 శాతం పెరిగి రూ.605.4 కోట్లకు చేరుకుంది. మొండిబాకీలు కూడా తగ్గాయి