
- కేంద్ర పాడి, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల...
ఖానాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మహిళలు పోరాటం జరపాలని కేంద్ర పాడి, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పిలుపునిచ్చారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్లమెంటరీ ప్రవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనీ అధికారంలో కి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని సూచించారు. పట్టణంలోని శివాజీ నగర్ లో జరిగిన 243 బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రమా దేవి, రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్చార్జి ఏ.శ్రీనివా స్, పార్ల మెం ట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు ప్రకాశ్, సంతోశ్, బీజేపీ నాయకులు ఉన్నారు.
భైంసా, వెలుగు: భైంసా పట్టణంలోని రాహుల్నగర్లో కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఓల్డ్ చెక్ పోస్టు నుంచి భారీ బైక్ ర్యాలీ తీశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
ఈ సందర్భంగా భైంసాలోని పశు వైద్యశాలకు రూ. కోటి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలకు బీజేపీ లీడర్ రామారావు పటేల్ వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా సహ ఇన్చార్జి మ్యాన మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు పైడిపెల్లి గంగాధర్,బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.