
- గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని కేంద్రానికి ఫిర్యాదు
- కృష్ణా, గోదావరి జలాల్లో తీరని అన్యాయం చేసింది గత బీఆర్ఎస్సే
- ఏపీకి నీళ్లను రాసిచ్చింది కేసీఆరే..
- 2018లోనే ఏపీ సర్కారు మూడు జీవోలు ఇచ్చిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ సర్కారేనని, నీళ్లను ఏపీకి రాసిచ్చారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వాళ్లు తీరని అన్యాయం చేస్తే.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీళ్లపై ట్రిబ్యునల్లో కాంగ్రెస్ సర్కారు పోరాడుతున్నదని చెప్పారు. రాయలసీమకు గోదావరి నదీ జలాల తరలింపు కూడా బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందని.. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్, తాను చేసిన కృషి ఫలితంగానే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను ఏపీకి కేంద్రం తిప్పి పంపిందని తెలిపారు. ఇది కాంగ్రెస్ సర్కా రు సాధించిన విజయమని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–1985 అవార్డుకు బనకచర్ల ప్రాజెక్టు విరుద్ధమని తమ ప్రభుత్వం వాదించిందని, ఆ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించిందని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారువల్లే ఏపీ ఆ ప్రాజెక్టు చేపడుతున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం అర్థరహితమన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు వల్లే కృష్ణా, గోదావరి జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు.
2016లోనే ప్రతిపాదన
గోదావరి–పెన్నా నదుల అనుసంధానం 2016లో కేసీ ఆర్ హయాంలోనే జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, ఆ రాష్ట్ర అధికా రులు, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, అధికారులు.. ఆనాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 2018 మార్చి 29, 2018 జూన్ 13, 2018 సెప్టెంబర్ 5న గోదావరి–పెన్నా నదుల అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని గుర్తు చేశారు.
గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్కు మళ్లించేందుకు 2019 జూన్ 28, ఆగస్టు 2, సెప్టెంబర్ 23న ఆనాటి ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ సమావేశమయ్యారని చెప్పారు. బనకచర్ల లింక్కు మార్గం సుగమం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. నదుల అనుసంధానానికి పట్టిసీమ ప్రాజెక్టును నమూనాగా తీసుకున్నారని తెలిపారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి చంద్రబాబు సమర్పించారని, రాష్ట్రాల అభిప్రాయాలను కోరితే.. తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొన్నారు.
మన పర్మిషన్ లేకుండానే..
విభజన చట్టం 2014 ప్రకారం.. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రమైనా ఏదైనా ప్రాజెక్టును చేపట్టాలంటే రెండు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. కానీ, ఆ నిబంధనను ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు తమ అభ్యంతరాలేమీ లేవని.. కానీ, దాని ద్వారా అదనంగా తీసుకునే నీటిపై తీవ్రమైన అభ్యంతరాలున్నాయని తెలి పారు.
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనపై ఎమర్జెన్సీ మీటింగ్ను ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కోరామన్నారు. గోదావరి నదీ జలాల వివాద చట్టానికి పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విరుద్ధమని కేంద్రానికి స్పష్టంగా ఫిర్యాదు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక సాయం చేయొద్దని తాము కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి గుర్తుచేశారు.
10 అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా ఇటు కృష్ణా, అటు గోదావరి నీళ్లను తరలించుకుపోయేలా ఏపీ ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీని పెంచి రోజూ 9 టీఎంసీలు తరలించడంతోపాటు.. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా మరో 3 టీఎంసీల తరలింపు నకు కుట్రలు చేస్తున్నదని తెలిపింది. మంగళవా రం ప్రజాభవన్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బనకచర్ల ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు అవగాహన కల్పించారు. 10 అంశాల ను క్షుణ్నంగా వివరించారు.