- ధరలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నం
న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్ (స్టోరేజ్) నుంచి 50 లక్షల టన్నుల గోధుమలు, 25 లక్షల టన్నుల బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్మనున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో గోధుమలు, బియ్యం ధరలు తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బియ్యం రిజర్వ్ ధరను కిలోకి రూ. 2 తగ్గించి రూ. 29 చేశారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద బియ్యం కొనడానికి ఎక్కువ మంది ముందుకు రాకపోవడం వల్లే రేటును తగ్గించారు. గోధుమలపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపుపై భవిష్యత్లో ఆలోచిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పరిస్థితులను గమనిస్తున్నామని, అవసరమైనప్పుడు ఆ చర్య తీసుకుంటామని పేర్కొంది.
సెంట్రల్ పూల్ నుంచి ఓఎంఎస్ఎస్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బల్క్ బయ్యర్లకు గోధుమలు, బియ్యం విక్రయిస్తోంది. ఈ ఏడాది జూన్ 28 నుంచి ఈ–ఆక్షన్ ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. గత రెండు నెలలుగా గోధుమలు, బియ్యం రేట్లు మార్కెట్లో పెరుగుతుండటం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా మీడియాకు చెప్పారు. బియ్యం రిజర్వ్ ధర తగ్గించడంతో ఇప్పుడు కొనుగోలుదారులు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓఎంఎస్ఎస్ కింద గోధుమల అమ్మకం బాగా సాగుతోందని ఆయన వెల్లడించారు. జూన్లో ప్రకటించిన గోధుమ, బియ్యం అమ్మకాలకు ఇప్పుడు ప్రకటిస్తున్నది అదనమని
వివరించారు.