- సోషల్ మీడియా, ఓటీటీల కంట్రోల్కు ఎథిక్స్ కోడ్
- కొత్త రూల్స్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఓటీటీల్లో వచ్చే ఫేక్ మెసేజ్లు, రెచ్చగొట్టే కామెంట్లు, గలీజ్ వీడియోలు, అభ్యంతరకర సినిమాలు/వెబ్సిరీస్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గైడ్లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021ను తీసుకొచ్చింది. ఎథిక్స్ కోడ్లోని ఆ వివరాలను గురువారం కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. సోషల్ మీడియా సైట్లు, ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్ఫాంలు తప్పనిసరిగా ఆ రూల్స్ను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. దేశంలో సోషల్ మీడియా కంపెనీలు వ్యాపారం చేసుకోవడం తమకూ ఇష్టమేనని, కానీ ఆ కంపెనీల చర్యలను కంట్రోల్ చేయాల్సిన అవసరమూ ఉందన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం, రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కూడా సూచించిందని, ఇందులో భాగంగానే తాజా గైడ్లైన్స్ రూపొందించామని చెప్పారు. అందరితో చర్చించిన తర్వాతే వీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మహిళలను అసభ్యంగా చూపించే పోస్టులు, ఫొటోల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని గైడ్లైన్స్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియా లేదా ఓటీటీ (ఓవర్ ద టాప్– ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటివి) ప్లాట్ఫాంలు కంటెంట్పై వచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అందులో రెండు తమంతట తామే కంటెంట్ను నియంత్రించుకునే (సెల్ఫ్ రెగ్యులేషన్) వ్యవస్థలను పెట్టాలి.
మొదటి అంచెలో సంబంధిత కంపెనీ/సోషల్మీడియా సైట్ సెల్ఫ్ రెగ్యులేషన్ (స్వీయ నియంత్రణ) వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
రెండో అంచెలో ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ను నియంత్రించేందుకు ప్రభుత్వం తరఫున సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏర్పాటు.
రెండో అంచెలో ఏర్పాటు చేసే సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీకి సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా ఏదైనా శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని చీఫ్గా నియమించాలి. పబ్లిషర్లకు ఆ అధికారే డిజిటల్ కంటెంట్పై సలహాలు, సూచనలు ఆదేశాలివ్వాలి. ఆ అధికారికి కంటెంట్ను బ్లాక్ చేసే అధికారమూ ఉంటుంది.
మొదటిరెండంచెల వ్యవస్థలను కంట్రోల్ చేసేందుకు సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రక్షణ, విదేశాంగ శాఖ, హోం శాఖ, సమాచార ప్రసార శాఖ, న్యాయ, ఐటీ శాఖకు చెందిన నిపుణులు ఉంటారు. కోడ్ ఆఫ్ ఎథిక్స్ను పాటించని కంటెంట్పై సుమోటోగా విచారణ చేసే హక్కూ కమిటీకి ఉంటుంది.
ఓటీటీ ప్లాట్ఫాంలు కచ్చితంగా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ (సమస్యలు) ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే డిజిటల్ మీడియా సంస్థలు.. తప్పనిసరిగా సమాచార ప్రసారశాఖ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
సోషల్మీడియాకు ఇంటర్మీడియరీస్
అభ్యంతరకర/అసభ్య పోస్టులు, సమస్యల పరిష్కారాల కోసం సోషల్ మీడియా సంస్థలు రెండు విభాగాలుగా ఇంటర్మీడియరీ (మధ్యవర్తిత్వ శాఖ)లను ఏర్పాటు చేయాలి.
త్వరలోనే ఆ ఇంటర్మీడియరీలకు సంబంధించి యూజర్లకు కేంద్రం నుంచి నోటిఫికేషన్లు.
ఈ ఇంటర్మీడియరీల ద్వారానే సమస్య/ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థల ఏర్పాటు.
గ్రీవెన్స్ ఆఫీసర్ పేరునూ ఇంటర్మీడియరీలే ప్రకటించాల్సి ఉంటుంది. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే సమస్యను ఆ గ్రీవెన్స్ అధికారి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి.
వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, తొలగించిన నిషేధిత కంటెంట్ వంటి వివరాలతో నెలనెలా ఇంటర్మీడియరీలు కంప్లయన్స్ రిపోర్ట్ను ఇవ్వాలి.
ఇంటర్మీడియరీలదే బాధ్యత
కంప్లయన్స్ ఆఫీసర్గా నియమించే వ్యక్తి కచ్చితంగా ఇండియాలో ఉండే వాడై ఉండాలి. చట్టాలు, అందులోని రూల్స్కు తగ్గట్టు ఆ అధికారి నడుచుకోవాలి.
పోలీసులు లేదా ఇతర చట్టబద్ధ సంస్థలతో 24 గంటల పాటూ కోఆర్డినేట్ చేసుకునేలా నోడల్ ఆఫీసర్ను నియమించాలి.
ఫిర్యాదు/సమస్య పరిష్కార వ్యవస్థ కింద రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా రెండింట్లో పెట్టిన అడ్రస్కు తగ్గట్టు ఇంటర్మీడియరీలు దేశంలోనే ఆఫీసులను (ఫిజికల్ కాంటాక్ట్ అడ్రస్) ఏర్పాటు చేయాలి.
మహిళల భద్రత, గౌరవానికి పెద్దపీట
ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోగా నిషేధిత కంటెంట్/అభ్యంతర, అసభ్యకర కంటెంట్ను ఇంటర్మీడియరీలు తొలగించాలి.
మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
మహిళలను అసభ్యంగా చూపించే పోస్టులు, న్యూడ్ ఫొటోలు, సెక్స్, వారి ప్రైవసీని దెబ్బతీసే కంటెంట్పై కఠినంగా వ్యవహరించాలి.
మహిళల మార్ఫ్డ్ ఫొటోలు పెట్టి బెదిరింపులకు దిగే కంటెంట్నూ వెంటనే తొలగించాలి.
మస్తు మంది యూజర్లు
సెల్ఫోన్లు పెరగడం, నెట్కనెక్టివిటీ ఎక్కువవడం వంటి కారణాలతో దేశంలో సోషల్ మీడియా హవా కూడా పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ఏయే ప్లాట్ఫాంలలో ఎంత మంది ఉన్నారో లెక్కలు చెప్పింది. దేశంలో వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య 53 కోట్లని చెప్పింది. ఏ సోషల్మీడియాతో పోల్చినా వాట్సాప్ యూజర్లే ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్ను 44.8 కోట్ల మంది, ఫేస్బుక్ను 41 కోట్ల మంది, ఇన్స్టాగ్రామ్ను 21 కోట్ల మంది, ట్విట్టర్ను కోటీ 75 లక్షల మంది వాడుతున్నట్టు పేర్కొంది.
యూజర్ల వెరిఫికేషన్
యూజర్ల వివరాలను సరిచూసుకునేందుకు (వెరిఫై) సోషల్ మీడియా ప్లాట్ఫాంలు స్వచ్ఛంద వ్యవస్థను కలిగి ఉండాలి. ఓ యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్ను తొలగించే ముందు.. ఎందుకు తొలగిస్తున్నారో ఆ యూజర్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యూజర్ వివరణ కూడా తీసుకోవాలి.
ఇవీ రూల్స్
కంపెనీలు/సోషల్ మీడియా స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ వ్యవస్థ పర్యవేక్షణకు సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో రెగ్యులేటరీ బాడీ.
పై రెండు అంచెల్లో కంటెంట్ నియంత్రణ జరగని పక్షంలో
కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో కమిటీ జోక్యం చేసుకుంటుంది.
తప్పుడు / వివాదాస్పద పోస్టులు సృష్టించిన వ్యక్తిని గుర్తించే బాధ్యత సంస్థలదే.
ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అభ్యంతరకర పోస్టులు తొలగించాలి
15 రోజుల్లోగా బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలి
ఫేక్ మెసేజ్ పుట్టించిన వ్యక్తిని గుర్తించాలె
తప్పుడు (ఫేక్) వార్తలు/మెసేజ్లు లేదా వివాదాస్పద, ద్వేషపూరిత పోస్టులు, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసే సెక్సువల్ పోస్టులను పెట్టిన మొదటి వ్యక్తిని కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలే గుర్తించాలి. దేశ సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, అత్యాచార, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన విషయాల్లో రూల్స్ను కఠినంగా అమలు చేయాలి.
ఓటీటీలో ఐదు ఏజ్ గ్రూపులు
ఈమధ్య ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్లలో అసభ్య సన్నివేశాలు ఎక్కువైతున్నాయి. సెన్సార్ లేకపోవడంతో బూతులు, అసభ్య సన్నివేశాలు వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో కంటెంట్ను ఐదు ఏజ్ గ్రూపులుగా విడగొట్టేందుకు కేంద్రం రూల్స్ తెచ్చింది. వాటి ప్రకారం…
యూ (యూనివర్సల్), యూ/ఏ7+, యూ/ఏ13+, యూ/ఏ16+, ఏ (అడల్ట్) అనే ఐదు కేటగిరీలుగా ఓటీటీలు కంటెంట్ను విభజించాలి.
యూ/ఏ13+ నుంచి అడల్ట్ కేటగిరీ వరకు కంటెంట్పై పేరెంటల్ లాక్ పెట్టాలి.
అడల్ట్ కేటగిరి కంటెంట్కు కచ్చితంగా వయసును నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.