
- రాష్ట్రంలోని 1.59 లక్షల కార్డుల గుర్తింపు.. ఎంక్వైరీకి ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. 80 శాతానికి పైగా కార్డుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు.. వీటిలో 30 శాతం కార్డులు అర్హత లేనివని గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన జాబితాలో రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులతో పాటు, ఆధార్ వివరాల్లో లోపాలున్న కార్డులను కూడా చేర్చింది. ఈ కార్డులను రీ -వెరిఫై చేసి, అనర్హతకు కారణాలను కనుగొని, అవసరమైతే రద్దు చేయాలని కేంద్రం సూచించింది. లబ్ధిదారులను, ఆధార్ వివరాల్లో తప్పులు, ఇతర అనర్హత కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు క్షేత్రస్థాయి విచారణను చేపట్టి, సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
పరిశీలనలో బయటపడిన అంశాల ప్రకారం.. 6 నుంచి 12 నెలల కాలంగా రేషన్ తీసుకోని కార్డుల్లో పలు అనర్హులున్నట్లు గుర్తించారు. కొందరు లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం, మరికొందరు కార్డు హోల్డర్లు చనిపోవడం, డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డులు పొందడం, 18 ఏండ్లు నిండని వ్యక్తుల పేరిట కార్డులు జారీ కావడం, ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, రేషన్ కార్డులో మరొకరి పేరిట ఉండటం వంటి లోపాలు బయటపడ్డాయి.
అలాగే, బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్నవారు తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో కూడా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని తేలింది. కార్డుల పరిశీలన చివరి దశలో ఉంది. జిల్లా సివిల్ సప్లై అధికారులు సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత, అనర్హత కారణాలతో కేంద్రం పంపిన లిస్టులో ఉన్న చాలా వరకు కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.