హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి 2023–24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో సాగైన పంటలో 75.40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేపట్టడానికి అనుమతించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు సీజన్లలో 30 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రైస్, మిగతావి రారైస్ తీసుకునేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
దీంతో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పాటు ఎన్నికల హామీ రూ.500 బోనస్ను రైతులకు చెల్లించి వడ్లు సేకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులకు లబ్ధి చేకూరేందుకు వీలున్న అన్ని మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోందని చెప్పారు.