ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయన సెక్యూరిటీని జడ్ ప్లస్ స్థాయికి పెంచినట్లు గురువారం కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే భద్రతకు సంబంధించి అధికారుల నుంచి ఇటీవల నివేదిక అందగా.. దానిపై సమీక్షించి తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో భాగంగా ఇకపై ఖర్గేకు సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పించనున్నారు. దేశంలోని వీఐపీ నేతలకు ఉన్న ముప్పు స్థాయిని బట్టి వారికి ఎక్స్, వై, వై ప్లస్, జడ్, జడ్ ప్లస్ కేటగిరీలుగా భద్రతను కేంద్ర హోం శాఖ కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చే నివేదికల ఆధారంగా సమీక్షించి, భద్రతలో మార్పులు చేర్పులు చేస్తుంటుంది.