
బ్యాంక్ చీఫ్లకు సూచించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న వ్యాపారాలకు సాయం చేసేందుకు వన్ టైమ్ డెట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అమలులోకి తేవడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 15 నాటికి ఈ రిజల్యూషన్ స్కీమ్ను అమలులోకి తీసుకురావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు. కరోనా సంక్షోభంతో నష్టపోయిన వ్యాపారాలకు మద్ధతుగా నిలవాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల హెడ్లను సీతారామన్ కోరారు. లెండర్లు తమ క్రెడిట్ వర్తీ నెస్ పై పెట్టుకున్న అంచనాలు కరోనా వలన ప్రభావితం కావని అభిప్రాయపడ్డారు. ఈ రిజల్యూషన్ ప్లాన్ను తీసుకురావడం కోసం బ్యాంకులు తమ బోర్డ్ల నుంచి తొందరగా ఆమోదం పొందాలని ఫైనాన్స్ మినిస్టర్ కోరారు. దీంతో పాటు అర్హులైన బారోవర్లను గుర్తించడం, వారికి ఈ రిజల్యూషన్ను అందేలా చేయడంపై చర్చించారు. కార్పొరేట్, రిటైల్ లోన్లను ఎన్పీఏలుగా గుర్తించకుండా ఉండేందుకు, లోన్లను వన్ టైమ్ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ గత నెలలో అనుమతిచ్చింది. తమ రిజల్యూషన్ పాలసీలతో రెడీగా ఉన్నామని ఈ మీటింగ్లో లెండర్లు ఆర్థిక మంత్రికి హామీ ఇచ్చారు. ఇప్పటికే అర్హులైన బారోవర్లను గుర్తించడం ప్రారంభించామని, వీరికి చేరువవుతామని చెప్పారు. ఆర్బీఐ నిర్దేశించిన టైమ్లైన్లోపు ఈ పనులన్నీ చేస్తామని పేర్కొన్నారు. కరోనా వలన నష్టపోయినవారి లోన్లను రీస్ట్రక్చరింగ్ చేయడానికి గల అర్హతలను కేవి కామత్ ప్యానెల్ రికమండ్ చేయనుంది. ఈ రికమండేషన్స్ బయటకు రావడాని కంటే ముందే ఈ మీటింగ్ జరిగింది. ఈ నెల 6 లోపు కరోనాతో నష్టపోయిన అకౌంట్ల కోసం ఓ రిజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ను ఫైనలైజ్ చేస్తామని గత నెలలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. లోన్లను రీస్ట్రక్చరింగ్ చేయడం ద్వారా ప్రస్తుత సంక్షోభం నుంచి కొన్ని వ్యాపారాలు బయటపడగలవని అప్పుడు చెప్పారు.
మారటోరియం వడ్డీ కట్టాల్సిందే!
లాక్డౌన్ సమయంలో లోన్లపై మారటోరియం తీసుకున్న వాళ్లు ఆ కాలానికి వడ్డీ చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈఎంఐలు కట్టడానికి కంపెనీలకు, జనానికి ఎక్కువ సమయం ఇవ్వడమే మారటోరియం స్కీమ్ ఉద్దేశమని, కస్టమర్లు వడ్డీని తప్పకుండా చెల్లించాల్సిందేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘‘కస్టమర్లు ఇప్పటికిప్పుడు కిస్తీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అన్ని సెక్టార్లు కోలుకునేలా చూస్తాం. స్ట్రెస్డ్ అసెట్స్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందేలా బ్యాంకింగ్ సెక్టార్లో మార్పులు తెస్తాం. ఈ నెల ఆరున ఎక్స్పర్ట్ కమిటీ సెక్టార్లవారీగా గైడ్లైన్స్ ప్రకటిస్తుంది’’ అని ఆయన వివరించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం వడ్డీ మాఫీ చేయాల్సిన అవసరం లేదని మెహతా వాదించారు. ఇందుకు జస్టిస్ సుభాషణ్ రెడ్డి స్పందిస్తూ వడ్డీపై వడ్డీ వసూలు చేయకూడదని, దీనిపై ఆర్బీఐ వివరణ ఇవ్వాలని అన్నారు.
ఖాతాలను ఎన్పీఏలుగా ప్రకటించకండి
కిస్తీలు చెల్లించని వారి ఖాతాలను నాన్–పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అకౌంట్గా ప్రకటించకూడదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మారటోరియం కాలంలోనూ వడ్డీ వసూలు చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు ఇంటెరిమ్ ఆర్డర్ ఇచ్చింది. తమ ఆదేశాలు వచ్చాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
For More News..