హైదరాబాద్, వెలుగు: భారత్ స్టాండర్డ్ (బీఎస్–6) కార్లలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) కిట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ కిట్స్ను కార్లలో అమర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. సీఎన్జీని అమర్చుకోవడం ద్వారా కార్ల నిర్వహణ ఖర్చు తగ్గే చాన్స్ ఉంది. ప్రస్తుతం బీఎస్–6 వాహనాలు మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. ఒకటి, రెండు కార్లలోనే సీఎన్జీ ఆప్షన్ ఉండగా, మిగతా వాటిల్లో పర్మిషన్ లేదు. గతంలో ఉన్న బీఎస్–4, బీఎస్–3 బండ్లకు సీఎన్జీ అమర్చుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా కొత్త బండ్లలో కూడా వీటిని అమర్చుకునేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.
తగ్గనున్న నిర్వహణ ఖర్చు
సీఎన్జీ కిట్లతో సాధారణ ప్రజలకు ఎంతో మేలు కలగనుంది. దీని ద్వారా కార్ల నిర్వహణ ఖర్చు 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. తరుచూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటం జనాలకు భారంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108గా ఉంది. అదే కిలో సీఎన్జీ రూ.69 మాత్రమే ఉంది. సీఎన్జీ కంటే పెట్రోల్కు 40 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీ బండ్లు మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తాయి. సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దాకా ఎక్కువగా మైలేజ్ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక సీఎన్జీ రేట్లు తరచూ మారవు. ఏడాదికి నాలుగైదు సార్లు మాత్రమే ధరల్లో మార్పు ఉంటుంది. ఒకవేళ సీఎన్జీ బంకులు అందుబాటులో లేని చోట్ల కార్లలో పెట్రోల్ పోయించుకొని ప్రయాణించవచ్చు. సీఎన్జీతో కారు ఇంజిన్లోని పైపులు, ట్యూబ్లు దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీంతో ఇంజిన్ జీవితకాలం పెరుగుతుంది. తరచూ సర్వీసింగ్లు చేయించాల్సిన సమస్య ఉండదు. ఇంధన లీకేజీ జరిగితే పెట్రోల్, డీజిల్ మాదిరిగా మిగిలిన భాగాలకు వ్యాపించి ప్రమాదకరంగా మారదు.