గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేద్దాం : చల్లా వంశీచంద్​రెడ్డి

గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేద్దాం : చల్లా వంశీచంద్​రెడ్డి
  •     సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్​రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి రాహుల్​గాంధీని ప్రధానిని చేసుకుందామని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్​లో కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్  పార్టీకి పట్టం కట్టారన్నారు.

ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తుందన్నామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం రేవంత్​రెడ్డి కష్టపడి పని చేస్తున్నారన్నారు. పాలమూరు బిడ్డను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన అధిష్టానానికి, సీఎం ఇన్​చార్జిగా ఉన్న పాలమూరు ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాలని కోరారు. రాహుల్​గాంధీని ప్రధానిని చేసుకోవాల్సిన భాధ్యత ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త పై ఉందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి నియోజకవర్గ అబివృద్ది కోసం ఎంతో తపన పడుతున్నారని, సీఎంను కలిసి రింగ్​రోడ్డుతోపాటు జడ్చర్లను ఇండస్ట్రియల్​ హబ్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన నిర్వహిస్తే అందులో ఎక్కువగా భూ కబ్జా పిర్యాదులే వచ్చాయని చెప్పారు. భూములు, పొలాలు  కబ్జా చేసి బిల్డింగులు నిర్మించుకున్నారని, వీటిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో బీఆర్ఎస్​ నేతల అవినీతి చిట్టాను బయటపెడతానన్నారు. ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీఎమ్మార్, కసిరెడ్డి నారాయణ​రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనారెడ్డి​పాల్గొన్నారు.