- రిస్ట్రిక్షన్లు పెరిగితే మొండిబాకీలు పెరిగే ఛాన్స్
- ఇప్పటికే కరోనా 1.0 , 2.0 నుంచి పూర్తిగా రికవరీ కాని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు
- రీస్ట్రక్చర్ చేసిన లోన్లతోనే పెద్ద సమస్య
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలకు కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు, చిన్న వ్యాపారాలకు ఇచ్చిన లోన్లు మొండిబాకీలుగా (ఎన్పీఏలుగా) మారే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దీంతో పాటు క్రెడిట్ కార్డు లోన్లు, పర్సనల్ లోన్లు వంటి అన్సెక్యూర్డ్ లోన్లు కూడా బ్యాంకులపై గుదిబండలా మారొచ్చని పేర్కొన్నాయి. కరోనా మొదటి వేవ్, రెండోవేవ్ టైమ్లో ఇబ్బంది పడిన చాలా మంది బారోవర్లు, బ్యాంకులు ఆఫర్ చేసిన లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ను ఎంచుకున్నాయి. దీంతో బ్యాంకుల లోన్ రీస్ట్రక్చరింగ్ లోన్ బుక్ వాల్యూ కూడా పెరిగింది. ఒకవేళ థర్డ్వేవ్ వస్తే ఇటువంటి బారోవర్లు అప్పులు తిరిగి చెల్లించడంలో ఇంకా ఇబ్బంది పడతారని, వీరికిచ్చిన లోన్లు మొండిబాకీలుగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. రిటెయిల్ లోన్లు, చిన్న, మధ్యతరహా బిజినెస్లకు ఇచ్చిన లోన్లను బ్యాంకులు రీస్ట్రక్చర్ చేస్తున్నాయి. లోన్లను రీస్ట్రక్చరింగ్ కింద బారోవర్లు అప్పులపై వడ్డీని తగ్గించడం లేదా లోన్ను కట్టడానికి మరింత టైమ్ ఇవ్వడం లేదా బకాయిలపై వడ్డీని రద్దు చేయడం వంటి చర్యలను బ్యాంకులు అందిస్తాయి.
ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే..
దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాలు రిస్ట్రిక్షన్లను పెట్టడం స్టార్ట్ చేశాయి. ఇది ఇలానే కొనసాగితే బ్యాంకులపై నెగెటివ్ ప్రభావం పడుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ నుంచి బ్యాంకులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వీటి బ్యాడ్ లోన్లు తగ్గుతున్నాయి. కిందటేడాది మార్చి నాటికి 7.48 శాతంగా ఉన్న బ్యాంకింగ్ సెక్టార్లోని గ్రాస్ ఎన్పీఏ (ఎన్పీఏ) లు, అదే ఏడాది సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి తగ్గాయి. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడంతో, కొన్ని సెక్టార్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాంకులు అసెట్ క్వాలిటీపై థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ముఖ్యంగా కరోనా సెకెండ్ వేవ్ టైమ్లో బ్యాంకులు తమ లోన్ బుక్ను రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఆర్బీఐ వీలు కల్పించింది. ప్రస్తుతం ఇలా రీస్ట్రక్చర్ అయిన లోన్లు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఇక్రా ప్రకటించింది.
లోన్ కట్టలేని బారోవర్లపై మరింత ఒత్తిడి..
థర్డ్వేవ్ వలన బ్యాంకుల లాభదాయకత తగ్గొచ్చని, లోన్ల రికవరీలో అడ్డంకులు రావొచ్చని ఇక్రా అభిప్రాయపడింది. ‘ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు వచ్చిన కరోనా వేవ్ల టైమ్లో ఇబ్బంది పడిన బారోవర్లు, థర్డ్వేవ్ టైమ్లో లోన్లను తిరిగి చెల్లించడంలో మరింతగా ఇబ్బంది పడొచ్చు. దీంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల అసెట్ క్వాలిటీ, లాభదాయకత, లోన్లను రికవరీ చేయడంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అన్నారు. రీస్ట్రక్చరింగ్ కింద చాలా వరకు లోన్లపై 12 నెలల వరకు మారటోరియాన్ని బ్యాంకులు ఇచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి పీరియడ్ లేదా ఏప్రిల్–జూన్ మధ్య బ్యాంకులు రీస్ట్రక్చర్ చేసిన లోన్లపై మారటోరియం తొలగిపోతుందని గుప్తా అన్నారు. కరోనా 2.0 టైమ్లో చాలా మంది బారోవర్లు బ్యాంకులు ఆఫర్ చేసిన రీస్ట్రక్చరింగ్ స్కీమ్ను వినియోగించుకున్నారు. కరోనా 2.0 టైమ్లో రూ. 1.2 లక్షల కోట్లు, కరోనా 1.0 టైమ్లో రూ. లక్ష కోట్లు విలువైన లోన్లను బ్యాంకులు రీస్ట్రక్చరింగ్ చేశాయని అంచనా.