హెల్త్ ట్రాకింగ్ కోసం.. చంద్రబాబు ఉంగరంలో చిప్

హెల్త్ ట్రాకింగ్ కోసం.. చంద్రబాబు ఉంగరంలో చిప్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే .. నిరాడంబరంగా, సాదాసీదాగా ఉండే ఆయన రూపం కనిపిస్తుంది. చేతికి వాచీతో కానీ.. ఉంగరాలతో కానీ చంద్రబాబు  ఎన్నడూ కనిపించలేదు. అలాంటిది తాజాగా ఆయ‌న వేలికి ఓ ప్లాటినం ఉంగ‌రం లాంటిది క‌నిపిస్తోంది.  దాని గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో స్వయంగా చంద్రబాబే .. అన్నమయ్య జిల్లా ప‌రిధిలోని మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన టీడీపీ మినీ మ‌హానాడులో ఆ ఉంగరం లాంటి దాని గురించి చెప్పారు.

‘‘నేను వేలికి వేసుకున్నది కేవ‌లం ఉంగ‌రం మాత్రమే కాదు.  అందులో ఓ చిప్ ఉంది. అది నా ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్పటికప్పు తెలియజేస్తుంది. నా హార్ట్ బీట్‌, స్లీపింగ్ అవ‌ర్స్‌, ఆహారం త‌దిత‌ర అంశాల‌న్నింటినీ రికార్డు చేస్తుంది. ఈ మొత్తం సమాచారాన్ని నా కంప్యూట‌ర్‌కు పంపుతుంది’’ అని చంద్రబాబు చెప్పారు.  ‘‘రోజూ  నిద్ర లేచిన వెంట‌నే కంప్యూట‌ర్‌లోకి ఈ ప్లాటినం ఉంగ‌రం పంపిన రిపోర్ట్ ను చెక్ చేసుకుంటా. రోజువారీగా జ‌ర‌గాల్సిన చర్యల్లో  ఏది త‌ప్పుగా ఉంద‌నే విష‌యాన్ని ఈ చిప్ ఇట్టే చెప్పేస్తుంది’’ అని పేర్కొన్నారు.  ఆ నివేదిక‌ ఆధారంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలో ఏం త‌ప్పు చేశానన్నది గ్రహించి.. మళ్లీ ఆ లోటుపాటు జరగకుండా అప్రమత్తంగా ఉంటానన్నారు.