వారం రోజుల్లో రెండుసార్లు జరిమానాలకు గురైన ఎయిర్ఇండియా తన మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రయాణికులకు ఒక స్థాయికి మించి మద్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ విషయంలో క్యాబిన్ సిబ్బంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీని ప్రకారం ప్రయాణికులకు ఒకసారి మద్యం అందించిన తర్వాత రెండోసారి మద్యం ఇచ్చేందుకు ఆలోచించాలని ఆదేశించింది.
ప్రయాణికులకు క్యాబిన్ సిబ్బంది మద్యం ఇవ్వమని చెప్పేందుకు ఒక పద్దతిని పాటించాలని ఎయిర్ ఇండియా సూచించింది. ప్రయాణికులను తాగుబోతు అని సంబోధించడం, వారితో ఘర్షణకు దిగడం చేయొద్దని ఆదేశించింది. వారితో గౌరవంగా మాట్లాడుతూనే మద్యం ఇవ్వకూడదని పేర్కొంది. దీంతోపాటు ఫ్లైట్లోకి మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులను గుర్తించే బాధ్యత సిబ్బందిదేనని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియాకు వారం వ్యవధిరో రెండు జరిమానాలు పడ్డాయి. పారిస్ ఢిల్లీ ఫ్లైట్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్ చేయనందుకుగానూ డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఎయిర్ ఇండియాకు చెందిన న్యూయార్క్ న్యూ ఢిల్లీ ఫ్లైట్లో ఓ ప్రయాణికుడు ఓ మహిళ యాత్రికురాలిపై మూత్రం పోసిన ఘటనపై ఎయిర్ ఇండియాకు 30 లక్షల జరిమానా విధించింది. అలాగే నవంబర్ 26, 2022న ఎయిర్ ఇండియా డైరెక్టర్పై కూడా 3 లక్షల జరిమానా విధించింది.