న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కాన్వాయ్పై జరిగిన టెర్రర్ ఎటాక్ ఎన్నికల వేళ బీజేపీ చేసిన స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు. శనివారం సాయంత్రం ఐఏఎఫ్ కాన్వాయ్పై టెర్రరిస్టుల కాల్పుల్లో వాయుసేనకు చెందిన ఒక సైనికుడు చనిపోగా నలుగురు గాయపడ్డారు.
దీనిపై చన్నీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది ఉగ్రవాద దాడి కాదు. బీజేపీ ఎన్నికలకు ముందు చేస్తున్న స్టంట్. ఇందులో వాస్తవం లేదు. బీజేపీ ప్రజల ప్రాణాలతో, శరీరాలతో ఆడుకుంటోంది” అని అన్నారు. ఎన్నికల్లో పరిస్థితులను తారుమారు చేసేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశాలను పెంచేందుకు ముందస్తుగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు.