మలిప్రేమ గొప్పతనం చాటే చెన్నై లవ్‌‌ స్టోరీ

మలిప్రేమ గొప్పతనం చాటే చెన్నై లవ్‌‌  స్టోరీ

‘చెన్నై లవ్ స్టోరీ’  సినిమా  ప్రశంసలు తీసుకొచ్చి, తమ బ్యానర్స్‌‌కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని  నిర్మాత ఎస్‌‌కేఎన్ అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరు దర్శకత్వంలో  సాయి రాజేష్‌‌తో  కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రం జులై 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌‌కేఎన్ చెప్పిన విశేషాలు.

‘‘సాయి రాజేష్​ కథ, కథనం అందించిన ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు.  ఈ ఏడాది అన్ని అవార్డుల నామినేషన్స్‌‌లో కిరణ్ గారి పేరు ఉంటుందని గట్టిగా చెప్పగలను. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించాలనే శ్రీ గౌరి ప్రియను ఎంపిక  చేశాం. ఆమె పండించిన  ఎమోషన్స్ చాలా రోజులు  గుర్తుంటాయి. తొలి ప్రేమ నేపథ్యంగా ‘బేబి’ తీశాం. ఇందులో  మలిప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం.  

సముద్రం నేపథ్యంగా సాగే సీన్స్ ఏపీలోని చీరాల, వైజాగ్ బీచ్‌‌లతో పాటు పాండిచ్చేరిలో తీశాం. చెన్నై లైట్ హౌస్ దగ్గర కొన్ని సీన్స్ తీశాం. ఎమోషన్స్‌‌తో  ఆకట్టుకోవాల్సిన ఈ కథకు విజువల్ బ్యూటీ అవసరం. అందుకే వర్షం, సూర్యోదయం నేపథ్యంగా సాగే సీన్స్ కోసం సహజంగా వచ్చేలా వెయిట్ చేసి చేశాం. 

అవుట్‌‌పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మణిశర్మ గారి మ్యూజిక్ అస్సెట్ అవుతుంది.  తెలుగు వెర్షన్‌‌ రిలీజ్ వర్క్స్ స్పీడ్‌‌గా జరుగుతున్నాయి. తమిళ రిలీజ్ అదే వారమా, తర్వాతి రెండు వారాల్లోనా అనేది ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని ఇంటరెస్టింగ్  ప్రాజెక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. త్వరలోనే వాటిని  అనౌన్స్ చేస్తాం’’.