17 ఏండ్లకే ఓటర్​ దరఖాస్తు

17 ఏండ్లకే ఓటర్​ దరఖాస్తు
  • అవకాశమిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
  • 18 ఏండ్లు నిండాకే ఓటరు ఐడీ జారీ
  • రాష్ట్ర ఎలక్షన్​ కమిషనర్లకు సీఈసీ ఆదేశం

న్యూఢిల్లీ : పదిహేడేండ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరు ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్(సీఈసీ), కమిషనర్​ అనూప్​ చంద్రపాండే గురువారం ప్రకటించారు. అయితే 18 ఏండ్లు నిండిన తర్వాతే ఓటర్​ కార్డును జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 18 ఏండ్లు నిండినోళ్లు .. ఓటర్ కార్డు కోసం అప్లై చేయాలంటే జనవరి 1దాకా వేచి చూడాల్సి ఉండేదన్నారు. ఈ నిర్ణయంతో ముందస్తుగానే ఓటర్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వివరించారు. 17 ఏండ్లు ఉన్నప్పుడే ఓటర్​ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఏడాది కలిసి వస్తుందన్నారు. దీంతో పాటు ఎన్నికల చట్టంలో ఇంకిన్ని కీలక మార్పులు చేసినట్టు తెలిపారు. ఇకమీద జనవరి 1తో పాటు ఏప్రిల్​ 1,  జులై 1, అక్టోబర్​ 1ను లెక్కలోకి తీసుకుంటామన్నారు.

ఆగస్టు 1 తర్వాత కొత్త ఫారాలు
ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు, ఈఆర్‌‌‌‌వో.. ఏఈఆర్‌‌‌‌వోలకు రాజీవ్​ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. 17 ఏండ్లు నిండినవారు ఎవరైనా ఎలక్షన్​ కార్డు కోసం అప్లై చేస్తే యాక్సెప్ట్​ చేయాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన తరువాతే వారికి కార్డు జారీ చేయాలన్నారు. 2023లో ఏప్రిల్‌‌‌‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌‌‌‌ 1 నాటికి 18 ఏండ్లు నిండే ప్రతీ ఒక్కరు అడ్వాన్స్‌‌‌‌గా ఓటర్‌‌‌‌ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫ్‌‌‌‌ ఎలక్టోర్స్ రూల్స్‌‌‌‌, చట్టాల్లో మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రతీ 3 నెలలకోసారి కొత్త ఓటర్​ కార్డులతో పాటు కరెక్షన్​ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.  దరఖాస్తు ఫారాలు ఆగస్టు 1 తర్వాత అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అప్పటి వరకు పాత దరఖాస్తు ఫారాలతో అప్లై చేసినా యాక్సెప్ట్​ చేస్తామన్నారు.