- నేటి నుంచి ‘‘చిల్డ్రన్ ఫర్ అలెప్పీ’’ ప్రారంభం
- నిత్యావసర వస్తువులు సేకరించి అందజేత
- సమాజ సేవపై స్టూడెంట్స్కు స్పెషల్ లెసన్
- అలప్పుజ జిల్లాలో సరికొత్త కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం
అలప్పుజ (కేరళ) : కేరళలోని స్కూల్ స్టూడెంట్స్ తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. పేదరిక నిర్మూలనలో మేము సైతం అని అడుగేస్తున్నారు. అలప్పుజలోని 100 మంది స్కూల్ స్టూడెంట్స్.. తీర ప్రాంతంలోని పేద కుటుంబాలను దత్తత తీసుకున్నాయి. ప్రతీ నెల వారికి నిత్యావసర వస్తువులు అందించేందుకు నిర్ణయించారు. సోమవారం నుంచే ‘‘చిల్డ్రన్ ఫర్ అలెప్పీ”అనే ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల బాధలు పంచుకోవడంతో పాటు సమాజ సేవపై పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠ్యాంశం రూపంలో ఈ స్పెషల్ మిషన్ ను అలప్పుజ కలెక్టర్ వీర్ కృష్ణ తేజ ప్రారంభిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన 3,613 కుటుంబాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వారిని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ‘‘ఈ ప్రోగ్రాం దేశంలోనే మొట్టమొదటిది. అత్యంత నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే జిల్లాగా అలప్పుజ అవతరించనుంది. సోమవారం నుంచి జిల్లాలో ఒక్క పూర్ ఫ్యామిలీ ఉండదు”అని కలెక్టర్ వీర్ కృష్ణ తేజ తెలిపారు. అయితే, ఈ సాయం పొందుతున్న కుటుంబాల ఐడెంటిటీని మాత్రం అధికార యంత్రాంగం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నది.
నెలలో ఫస్ట్ మండే ‘‘సమాజ సేవా దినోత్సవం’’
జిల్లా పంచాయతీ, ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో ప్రతీ నెల మొదటి సోమవారం పాఠశాలల్లో ‘‘సమాజ సేవా దినోత్సవం’’గా పాటిస్తున్నట్లు కలెక్టర్ తేజ తెలిపారు. ‘‘ప్రతీ నెలలోని ఫస్ట్ సోమవారం ఫుడ్, ఇతర ఐటెమ్స్ తీసుకురావాలని సూచించాం. పప్పులు, సబ్బులు, టూత్పేస్ట్, పిండి, బియ్యం కాకుండా పేదలు ఉపయోగించే వస్తువులు, డబ్బులు తీసుకురావాలని చెప్పాం. ఇలా కలెక్ట్ చేసిన వస్తువులన్నింటినీ ఓ బాక్స్లో వేస్తాం. 300 స్టూడెంట్స్ ఉన్న స్కూల్.. మూడు అత్యంత పేద కుటుంబాలను దత్తత తీసుకుంటాయి. ఇలా సేకరించిన వస్తువులను వారికి అందజేస్తాం”అని కలెక్టర్ కృష్ణ తేజ తెలిపారు. కొన్ని స్కూల్స్లోని ప్రతీ 50 మంది స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకునేందుకు నిర్ణయించారని వివరించారు. ఇలా సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని స్టూడెంట్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
ప్రతీ స్కూల్లో కమ్యూనిటీ కో ఆర్డినేటర్
సివిల్ సప్లై ద్వారా రైస్ ఇస్తుండటంతో.. దీన్ని సేకరించాలనే ఆలోచన లేదని కలెక్టర్ తేజ వివరించారు. వస్తువు చిన్నదే అయినా.. నగదు రూపంలో కాకుండా వస్తువు రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రతీ స్కూల్లోని ఓ టీచర్ను కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్గా, ఒక స్టూడెంట్ను కమ్యూనిటీ సర్వీస్ లీడర్గా ఏర్పాటు చేశామని తెలిపారు. కమ్యూనిటీ సర్వీస్ క్లబ్దీన్ని కో ఆర్డినేట్ చేస్తుందన్నారు. ఇలా సాయం చేస్తే క్రెడిట్ అంతా స్టూడెంట్స్, వారి పేరెంట్స్కు వెళ్తుందన్నారు. ఈ ప్రోగ్రాంకు వారే హీరోలు అని కొనియాడారు. మరిన్ని సంస్థలు నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఒక స్కూల్ ప్రతీ నెల మెడిసిన్స్ అందజేసేందుకు సిద్ధమైందన్నారు. సమాజం గురించి ఆలోచించే కేరళలోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయని తెలిపారు.
బడ్జెట్లోనూ స్పెషల్ ఫండ్స్
రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమికొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, దీని కోసం పంచాయతీలు కూడా మైక్రో ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ తేజ వివరించారు. శుక్రవారమే 2023–24 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రవేశపెట్టారు. ఐదేండ్లలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కీలక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఫుడ్, హెల్త్, ఇన్కంతో పాటు షెల్టర్ అనే 4 అంశాల ఆధారంగా 64,006 అత్యంత పేద కుటుంబాలుగా గుర్తించారు. ఈ స్కీంకు సంబంధించిన గైడ్లైన్స్ను జారీ చేశారు. కుటుంబశ్రీ మిషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సాయంతో ఈ ప్రోగ్రాం అమలు చేయాలని కేరళ ప్రభుత్వం భావిస్తున్నది. దీని కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.