- ఫోన్లు వాడొద్దంటే మొండికేస్తున్నరు
- స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్న పిల్లలు
- ఎవరితోనూ కలుస్తలే, అనుబంధాలకూ దూరం
- ఐఎంహెచ్ సైకియాట్రిస్టుల స్టడీలో వెల్లడి
- మొదట్లోనే కంట్రోల్ చేయకుంటే ప్రమాదమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు చూసే పిల్లలు మొండిగా తయారవుతున్నారని, ఎదుగుతున్నకొద్దీ వారిలో నెగిటివ్ షేడ్స్ కూడా పెరుగుతున్నాయని సైకియా ట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. చదువుపై కాన్సంట్రేషన్ చేయలేకపోవడం, ఇతరులతో కలవకపోవడం, ఇంట్లో వాళ్లపై తిరగబడడం వంటి లక్షణాలతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు120 మంది పిల్లలపై హైదరాబాద్లోని మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్లో పని చేస్తున్న సైకియాట్రిస్టులు రిషికేశ్ గిరి ప్రసాద్, మానస ప్రభాకర్ స్టడీ చేశారు. నిలోఫర్ హాస్పిటల్కు వచ్చిన కొంత మంది పిల్లలు, వివిధ స్కూళ్ల నుం చి ఎంపిక చేసిన మరికొంత మంది పిల్లలపై గతే డాది చేసిన ఈ స్టడీ వివరాలను ఇటీవల సైకియాట్రీ జర్నల్లో పబ్లిష్ చేశారు.
4 ఏండ్ల నుంచి 17 ఏండ్ల వయసున్న పిల్లలను ఎంపిక చేసుకుని స్టడీ చేశారు. 4 నుంచి 10 ఏండ్ల వయసున్న పిల్లలను ఒక గ్రూపుగా, 11 నుంచి 17 ఏండ్ల పిల్లలను మరో గ్రూపుగా విభజించి వారి ప్రవర్తనలో మార్పులపై స్టడీ చేశారు. ఈ పిల్లలంతా సగటున రోజూ 2 గంటలకు మించే ఫోన్ను చూస్తున్నారు. వీరిలో పాతిక శాతం మంది పిల్లలే ఫోన్ను తమ చదువుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వాడుతుండగా, మిగిలిన వాళ్లంతా గేమ్స్ ఆడడానికి, రీల్స్ చూడడానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నట్టు తెలిపారు.
బుద్దిమాంద్యం లక్షణాలొచ్చే ముప్పు
స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్న 4 నుంచి 10 ఏండ్ల వయసు పిల్లలు ఇతరులతో మాట్లాడడానికి, కలవడానికి ఇష్టపడడం లేదని ఈ స్టడీలో డాక్టర్లు గుర్తించారు. ఇలా సోషల్ ఇంటరాక్షన్ తక్కువగా ఉండే పిల్లల్లో బుద్ధిమాంద్యం లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఎమోషనల్ అటాచ్మెంట్స్ తగ్గిపోతాయని, తల్లిదండ్రుల మాటను లెక్క చేయరని డాక్టర్లు చెప్తున్నారు. స్కూల్లో ఉన్న టైంలోనూ ఫోన్ గురించే ఆలోచిస్తూ, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇది పిల్లల భవిష్యత్పై నెగెటివ్ ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అందుకే పిల్లల ఫోన్ వినియోగాన్ని మొదట్లోనే కంట్రోల్ చేయాలని, ఇప్పటికే అలవాటైన పిల్లలకు నెమ్మదిగా తగ్గించాలని డాక్టర్లు సూచించారు.
మానలేక.. ఎదురు తిరుగుతున్రు
పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించి, కొంత మంది పేరెంట్స్ పిల్లల దగ్గర్నుంచి ఫోన్లు తీసేసుకుంటున్నారు. ఇలా ఫోన్ తీసుకున్నప్పుడు పిల్లలు పేరెంట్స్కు ఎదురు తిరుగుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా గేమ్స్ ఎక్కువగా ఆడుతున్న పిల్లలు, వాటిని మానలేక ఇబ్బంది పడుతున్నట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితో గేమ్స్ ఆడడం ఆపేయాలని భావిస్తున్నప్పటికీ, మానలేకపోతున్నామని పిల్లలు చెప్పినట్టుగా తెలిపారు. ఈ తరహా విత్డ్రాయల్ సింప్టమ్స్ ఆల్కహాల్ బానిసల్లో కనిపిస్తాయని, ఫోన్ విషయంలోనూ అదే తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్ట్ లో వివరించారు.
ఫోన్ వాడని పిల్లలు దొర్కలే
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడని పిల్లల ప్రవర్తనను స్టడీ చేయాలని కూడా తాము భావించినప్పటికీ అసలు ఫోన్ వినియోగించని పిల్లలే దొరకలేదు. పిల్లల్లో ఆ స్థాయిలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. ఒకట్రెండు ఏండ్ల వయసు నుంచే పిల్లలకు ఫోన్లు అలవాటు చేయడం వల్ల క్రమంగా పిల్లలు ఫోన్లే లోకంగా బతుకుతున్నారు.
- డాక్టర్ మానస ప్రభాకర్
ఒత్తిడి చేస్తే పేరెంట్స్పైనే తిరగబడుతున్నరు
కొంత మంది పిల్లలు గేమ్స్ మానేయాలని ఒత్తిడి చేస్తే, పేరెంట్స్పైనే తిరగబడుతున్నరు. రానురాను మరింత మొండిగా తయారవుతున్నరు. ఇలాంటి విపరీత లక్షణాలు రీల్స్ చూసే పిల్లల కంటే, గేమ్స్కు అడిక్ట్ అయిన పిల్లల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల పిల్లలతో పాటు, తల్లిదండ్రులు
కూడా డిప్రెషన్కు లోనవుతున్నారు.
- డాక్టర్ రిషికేశ్ గిరి ప్రసాద్