బీజింగ్: నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్జోంగ్ ఉన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నార్త్ కొరియా మిత్ర దేశమైన చైనా కిమ్ జోంగ్కు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ల బృందాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ఇచ్చింది. చైనా బృందం నార్త్ కొరియాకు ఎందుకు వెళ్లింది?, ఆ బృందంలో డాక్టర్లు ఎందుకు ఉన్నారు అనే విషయంపై క్లారిటీ రాలేదని చెప్పింది. చైనా పంపిన టీమ్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇంటర్నేషనల్ లైసన్ డిపార్ట్మెంట్కి సీనియర్ సభ్యుడు కూడా ఉన్నారని, ఈ డిపార్ట్మెంట్కు నార్త్ కొరియాతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ఈ అంశంపై ఆ డిపార్ట్మెంట్ స్పందించేందుకు నిరాకరించింది అని రాయిటర్స్ చెప్పింది. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం సరిగా లేదని, హార్ట్ సర్జరీ తర్వాత ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఉత్తరకొరియా కొట్టిపారేసింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిజం కాదు అన్నారు. కాగా.. కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ప్రజలకు కనిపిస్తారని ఉత్తర కొరియా వర్గాలు శుక్రవారం ప్రకటించాయి.
