ఆసియా గేమ్స్లో పాల్గొనే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఇండియా ఉషు ప్లేయర్లకు చైనా వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా హాంగ్జౌకు తన అధికారిక పర్యటనను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రద్దు చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఎనిమిది మందితో కూడిన ఇండియా ఉషు టీమ్లో భాగమైన ముగ్గురు మహిళా ప్లేయర్లు న్వేమన్ వాంగ్సు, ఒనిలు టెగా, మెపుంగ్ లంగుకు వీసాగా కూడా పని చేసే గేమ్స్ అక్రెడిటేషన్ ఇవ్వలేదు.
దాంతో గురువారం రాత్రి హాంగ్జౌ వెళ్లిన ఉషు టీమ్తో ప్రయాణించకుండా ఇండియాలోనే ఉండిపోయారు. అరుణాచల్ను తమ భూభాగం అని చెప్పుకునే చైనా ఇండియా ప్లేయర్లకు వీసా నిరాకరించడాన్ని కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ ఖండించాయి. వీరికి వీసా ఇప్పించేందుకు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్తో కలిసి కృషి చేస్తున్నట్టు ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ తెలిపారు.