న్యూఢిల్లీ/గౌహతి: అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ వేదికగా మన దేశం ఆదివారం నిర్వహించిన జీ20 సన్నాహక సమావేశానికి చైనా డుమ్మా కొట్టింది. ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనీషియేటివ్ గేదరింగ్స్’ పేరిట కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఈ మీటింగ్ కు అమెరికా సహా పలు జీ20 దేశాలకు చెందిన 50 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ప్రతినిధుల బృందం ఇటా నగర్ లోని అసెంబ్లీ భవనంతో పాటు ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది.ఈ సందర్భంగా వారు అరుణాచల్ ఆహార రుచులను కూడా ఆస్వాదించారు. ఈ మీటింగ్ కవరేజీకి మీడియాను అనుమతించకపోవడంతో సమావేశంలో చర్చించిన అంశాలేవీ బయటికి రాలేదు. అరుణాచల్పై భారత సార్వభౌమాధికారాన్ని చైనా అంగీకరించడం లేదు. ఆ రాష్ట్రం దక్షిణ టిబెట్లో భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది.
ఈ కారణం వల్లే అరుణాచల్ గడ్డపై నిర్వహించిన జీ20 సమావేశానికి చైనా డుమ్మా కొట్టి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కోణంలో చైనా అధికారికంగా జీ20కి ఫిర్యాదు చేసిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. మే నెలలో ‘సాంస్కృతిక’ అంశాలపై జమ్మూ కాశ్మీర్లో జీ20 మీటింగ్ను కూడా నిర్వహించనున్నారు. అక్కడ సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ చైనా, సౌదీ అరేబియా, టర్కీ ద్వారా పాకిస్తాన్లాబీయింగ్ చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి జీ20కి భారత్ నేతృత్వం వహిస్తోంది.