న్యూజెర్సీ: వచ్చే నవంబర్లో అగ్రరాజ్యం అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. అధికారంలో ఉన్న ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ను ఎలాగైనా ఓడించాలిన డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇద్దరు నేతల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కరోనా గురించి చైనాపై విమర్శలు చేస్తూ ఓటర్ల మనసులు గెలవాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు. మరోమారు ఆయన డ్రాగన్పై మండిపడ్డారు.
‘నిద్రావస్థలో ఉన్న జో బిడెన్ చేతిలో ఈసారి ఎన్నికల్లో నేను ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది. వాళ్లు మన దేశాన్ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నారు. ఒకవేళ బిడెన్ ప్రెసిడెంట్ అయితే మాత్రం చైనా మన దేశాన్ని పాలిస్తుంది. నవంబర్ ఎన్నికల్లో నేను ఓడిపోవాలని ఇరాన్ కూడా కోరుకుంటోంది. అయితే నేను గెలిస్తే మాత్రం ఇరాన్తో త్వరగా ఒప్పందాలు చేసుకుంటా. అలాగే నార్త్ కొరియాతో కూడా డీల్స్ కుదుర్చుకుంటా. నేను 2016లో గెలవకపోయి ఉంటే నార్త్ కొరియాతో మన దేశం యుద్ధానికి దిగాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే మనకు నార్త్ కొరియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. యూఎస్ ఎన్నికల్లో చైనాతో ప్రమాదం ఉందని నా నమ్మకం. మెయిల్ బ్యాలెట్స్తోనే అసలు ప్రమాదం. ఎందుకంటే వాటిని విదేశీ శక్తులు సులువుగా ఫోర్జరీ చేస్తాయి. అది రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఏవైనా సులువుగా ఫోర్జ్ చేయగలవు’ వారందర్నీ చాలా దగ్గర్నుంచి గమనిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.