ఓ జాబ్ ఫ్రాడ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు కోల్కతాలోని ఓ బ్యాంక్ అకౌంట్ను గుర్తించారు. నగదు ట్రాన్స్ఫర్ అయిన బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. అకౌంట్ హోల్డర్ అడ్రెస్ తీసుకుని ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు పూరిగుడిసె కావడంతో ఆశ్చర్యపోయారు. కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు
ఆ ఇంటి ఓనర్ పేరుతో సిమ్ కార్డులు తీసుకొని ఖాతాలు ఓపెన్ చేసినట్లు తెలుసుకున్నారు. కొంత కాలం నెలకు రూ.5 వేలు రెంట్ ఇచ్చి తరువాత కనిపించకుండా పోయారని గుర్తించారు. ఇక్కడితో కేసు దర్యాప్తునకు బ్రేక్ పడింది.
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్తో ఆన్లైన్లో దోపిడీకి పాల్పడుతున్నారు. లోకల్ ఏజెంట్లతో చైనీస్, నైజీరియన్లు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయిస్తున్నారు. మన దేశంలో కొట్టేసిన డబ్బులో కొంత భాగాన్ని ఏజెంట్లకు కమీషన్లు ఇస్తున్నారు. ఇందు కోసం బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్లతో లింకైన ఫోన్ నంబర్లు, ఓటీపీతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. గత రెండేండ్లలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 8,621 బ్యాంకు ఖాతాలు, 28,319 ఫోన్ నంబర్లను గుర్తించారు. ఇలాంటిదే సిటీ సైబర్ క్రైం పోలీసులు ట్రేస్ చేసిన చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో కూడా 113 ఖాతాలను లోకల్ ఏజెంట్లు ఆపరేట్ చేశారు. దుబాయిలో క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా సైబర్ నేరగాళ్లకు పంపించారు.
బ్యాంక్ అకౌంట్ల కోసం ఏజెంట్ల నెట్వర్క్
చైనీస్ నెట్వర్క్లోని ఏజెంట్లు హైదరాబాద్కు చెందిన మహ్మద్ మునావర్, అరుల్ దాస్, షా సుమైర్, షమీర్ ఖాన్తో లక్నోలో బ్యాంకు ఖాతాలను తెరిపించారు. ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చెల్లించారు. ఇలాంటిదే నార్త్ ఇండియాలోని గ్రామీణ ప్రాంతాలను ఫేక్ అకౌంట్ల కోసం సైబర్ నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఖాతాల్లో గవర్నమెంట్ స్కీమ్స్ డబ్బులు డిపాజిట్ అవుతాయని నమ్మిస్తున్నారు. యువకులకు కమీషన్ల ఆశ చూపుతున్నారు. నిరక్షరాస్యులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై అవగాహన లేనివారితో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నారు.
అద్దె, కమీషన్లతో అకౌంట్ల నిర్వహణ
ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో నైజీరియన్ గ్యాంగులు కింగ్ పిన్స్గా పనిచేస్తున్నాయి. ఆన్లైన్ ఫ్రాడ్స్లో చైనీస్ సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఢిల్లీ, ముంబై, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ సహా నార్త్ ఇండియాలోని ఏజెంట్లు రూ.కోట్ల కమీషన్ దందా చేస్తున్నారు. వాటిని ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఫ్రాడ్, వర్క్ ఫ్రం హోమ్ సహా ఆన్లైన్లో కొట్టేసిన డబ్బు ఇలాంటి అకౌంట్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. బ్యాంకు అకౌంట్స్ను వాడుకున్నందుకు అకౌంట్ హోల్డర్కు కొన్ని నెలల పాటు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తున్నారు. ఏజెంట్లకు10నుంచి 25 శాతం కమీషన్లు ఇస్తున్నారు. బాధితుల నుంచి కొట్టేసిన డబ్బును ఏజెంట్లు అందించిన ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. అలాగే నైజీరియన్లు చిరు వ్యాపారుల పేమెంట్ గేట్వే ద్వారా నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. లాటరీ, గిఫ్ట్ ఫ్రాడ్స్ లాంటి నేరాల్లో కొట్టేసిన డబ్బును తక్కువ మొత్తంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ను ఉపయోగిస్తున్నారు. అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసి ఇచ్చే వారికి ఐదు శాతం కమీషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వ్యాలెట్లోకి బదిలీ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో దేశాలు దాటిస్తున్నారు.