గుప్తనిధుల పేరుతో రూ.10 లక్షలు వసూలు  

గుప్తనిధుల పేరుతో రూ.10 లక్షలు వసూలు  
  • రాళ్లను డైమండ్స్​అని అంటగట్టింది
  • ముంబై తీసుకెళ్లి మాయం చేసింది
  • చీటింగ్ ​కేసు నమోదు చేసిన పోలీసులు

పర్వతగిరి, వెలుగు : గుప్తనిధులు ఎక్కడున్నాయో తనకు తెలుసని, తవ్వితే వజ్రాలు బయటపడతాయని నమ్మించి ఒకరిని మోసం చేసిందో కాంగ్రెస్ ​పార్టీకి చెందిన మండల నాయకురాలు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెతో పాటు సహకరించిన వారిపై పోలీసులు చీటింగ్​ కేసు నమోదు చేశారు. పర్వతగిరి ఎస్సై దేవేందర్​ కథనం ప్రకారం..వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన తొర్రి పద్మ అనే కాంగ్రెస్​ మండల నాయకురాలు భట్టు తండాకు చెందిన బాదావత్ బాలాజీకి గుప్త నిధుల ఆశ కల్పించింది. కొన్ని చోట్ల తవ్వాలంటూ లక్షల్లో వసూలు చేసింది. మరికొన్ని రోజులకు ఒకచోట నిధి ఉన్నట్టు తెలిసిందని, బయటకు తీయాలంటే మరింత ఖర్చవుతుందని నమ్మబలికింది.

ఇలా ఈ ఏడాది మే నెల నుంచి పలుమార్లు బాలాజీ దగ్గర సుమారు రూ.10 లక్షలకు పైగా కాజేసింది. కొన్ని రోజులకు వజ్రాలను పోలిన 21 రాళ్లను కవర్​లో పెట్టి బాలాజీకి ఇచ్చింది. ఇక్కడ అమ్మడం సాధ్యం కాదని, ముంబైలో అయితే రేటు వస్తుందని చెప్పి తీసుకువెళ్లింది. వెంట పద్మ భర్త కుమారస్వామి, హైదరాబాద్​కు చెందిన శివరాత్రి వెంకటేశ్వర్లు, ఏనుగల్లుకే చెందిన అనిల్ ​వెళ్లారు. వీరంతా అక్కడ కారులో ప్రయాణిస్తుండగా వజ్రాలు ఉన్న కవర్​ను మాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. డబ్బులు అడిగితే తన కొడుకును కిడ్నాప్​ చేశావని కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాలాజీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురిపై చీటింగ్​ కేసు నమోదు చేశారు.