
రాఖీ పండుగనాడు రంగురంగుల రాఖీలు కొంటారు అక్కా– చెల్లెళ్లు. వెరైటీ డిజైన్లు, ప్రత్యేకమైన బ్యాండ్స్ కోసం వెతుకుతుంటారు. వాటిలో చాలావరకు ప్లాస్టిక్వే ఉంటాయి. వాటిలో ఇంకొన్ని నాన్-బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో తయారు చేసినవి ఉంటాయి. ఇవి పది, పదిహేను రోజుల్లో ఊడిపోతాయి. అలా కాకుండా ప్రతీ రాఖీ అందంగా, పర్యావరణ అనుకూలమైందిగా కూడా ఉంటే ఎంత బాగుంటుంది. టెర్రకోట, జనపనారలతో చేసిన ఈ హ్యాండ్ మేడ్ రాఖీలతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. ఇలాంటి రాఖీలను తయారుచేస్తూ మంచి రెస్పాన్స్ పొందుతున్నారు కొందరు మహిళలు. ఆన్లైన్లో ఈ రాఖీలకు మంచి డిమాండ్ ఉంది. క్రియేటివిటీని ఉపాధిగా మార్చుకొని పర్యావరణ హిత రాఖీలను అందిస్తున్న మహిళల గురించి...
చాక్లెట్ రాఖీలు
చాక్లెట్ రాఖీలను బిహార్లోని గయలో గ్రామీణ మహిళలు తయారుచేస్తున్నారు. రంగు రంగులు పూలు, పక్షులు, జంతువుల ఆకారాల్లో ఈ రాఖీలు ఉంటాయి. అలాగే ట్రెండీ ఎమోజీలను కూడా చేస్తున్నారు. ప్రతి రాఖీలో కుంకుమ, అక్షింతల సెట్తో ఉంటుంది. అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్న ఉషా ప్రజాపతి ఈ విమెన్ టీమ్ను మొదలుపెట్టింది. బిహార్లో వంద మందికి పైగా మహిళలు ఈ వెంచర్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. రాఖీల ధర రూ .880, రూ .1200 మధ్య ఉంటుంది. samoolam.com వెబ్సైట్లో వీటిని కొనుక్కోవచ్చు.
మట్టి రాఖీ
అహ్మదాబాద్కు చెందిన సాచీ త్రిపాఠి అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాలేజీలో పీజీ చేసింది. లాక్డౌన్ టైంలో కొందరి చేతివృత్తుల వాళ్లకు డబ్బు సాయం చేసింది. అప్పుడు వాళ్లు ‘ మాకు డబ్బు సాయం అవసరం లేదు. మేము పని చేయడానికి తయారు చేసిన ప్రొడక్ట్స్ను మార్కెటింగ్ చేయడానికి రెగ్యులర్ సోర్స్ ఇవ్వండి’ అని అడిగారు. దాంతో సాచి ఆన్లైన్ మార్కెట్, ఎగ్జిబిషన్ల ద్వారా వాళ్లు చేసిన టెర్రకోట రాఖీలను అమ్ముతోంది. మీకు ఆ రాఖీలు కావాలంటే terracottabysachii.com వెబ్సైట్చూడండి.
సీడ్ రాఖీ
చాలా రాఖీలు నీళ్లతో తడిసి లేదా దారాలు వదులై ఊడిపోతాయి. కానీ మధ్యప్రదేశ్, రాజస్తాన్లోని 21 ఫూల్స్ అనే హ్యాండ్లూమ్ సెంటర్ ‘సీడ్ రాఖీ’ లను తయారు చేస్తోంది. ఈ రాఖీలకు సహజంగా రంగులు అద్ది, పత్తి నూలును చేత్తో అల్లి తయారు చేస్తారు. ఈ రాఖీల్లో గుమ్మడికాయ, అమరాంథస్, తులసి విత్తనాల వంటి కూరగాయల విత్తనాలు ఉంటాయి. ఈ రాఖీలను చేతికి కట్టుకొని ఆ తర్వాత నాటవచ్చు. ఈ రాఖీలు ఒక్కో బాక్స్ రూ.350 నుండి రూ.400 వరకు ఉంటాయి. వీటిని 21fools.com లో కొనుక్కోవచ్చు.