కరోనా సోకితే జేబు గుల్లే.. తలకిందులవుతున్న కుటుంబాలు

కరోనా సోకితే జేబు గుల్లే.. తలకిందులవుతున్న కుటుంబాలు

బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా.. పేదాపెద్దా తేడా లేకుండా అందరి జీవితాలనూ తలకిందులు చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, బయట కాలుపెట్టకున్నా కొందరికి వైరస్ సోకుతోంది. ప్రతి వ్యక్తి స్నేహితుల్లో, బంధువుల్లో ఒకరో ఇద్దరో వైరస్‌‌ బారిన పడుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చేరి ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో, మంత్లీ బడ్జెట్లపై, జీవితాలపై, కన్జూమర్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం...
ఇన్సూరెన్స్.. గందరగోళం..
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి కచ్చితంగా క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్‌‌ ఇవ్వాలని ఐఆర్‌‌‌‌డీఏఐ మొత్తుకుంటున్నా ఆస్పత్రులు పట్టించుకోవడం లేదు. డబ్బులు కడితేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో కొన్ని కంపెనీలు.. క్వారంటైన్ ఖర్చులనూ భరించే పాలసీలను ఇవ్వడం మానేశాయి. మరికొన్ని కంపెనీలు కనీసం 24 గంటలు ఇన్ పేషెంట్‌‌గా ఉంటేనే కవరేజీ ఇస్తామంటున్నాయి. ఇన్సూరెన్స్ పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. దీంతో రూ.లక్షలు పెట్టి అడ్మిషన్ తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలే ఎన్నికల ర్యాలీలు ముగిశాయి కాబట్టి కొన్ని రోజుల తరువాత కేసులు మరింత పెరుగుతాయని హెల్త్ ఎక్స్‌‌పర్టులు హెచ్చరిస్తున్నారు. 
నీళ్లలా ఖర్చవుతున్న డబ్బు
కరోనాకు ఎవరికి తోచినట్టు వారు ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తున్నారు. ప్రాంతాలను బట్టి, డాక్టర్లను బట్టి పద్ధతులు మారుతున్నాయి. ఎక్కడైనా రోగి ఆస్పత్రిలో అడుగుపెట్టగానే డబ్బులను నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ లేని వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి కరోనా సోకితే, వాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. కరోనా బాధితుల్లో నూటికి కనీసం పది మందికి అయినా హాస్పిటలైజేషన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
ఇప్పటికీ చాలా మంది టెస్టులకు దూరమే
కరోనా పాజిటివ్ వస్తే ఇరుగుపొరుగు తామేదో పాపం చేస్తున్నట్టు చూస్తారనే భయంతో చాలా మంది లక్షణాలు ఉన్నా కరోనా టెస్టులు చేయించుకోవడం లేదు. కరోనా పేషెంట్లను అంటరాని మనుషులుగా చూసే బ్యాడ్‌‌ కల్చర్ కనిపిస్తోంది. ఇంకో సమస్య ఏమిటంటే.. చాలా సార్లు టెస్టుల రిజల్ట్స్ నమ్మదగ్గవిగా ఉండటం లేదు. వ్యాధి లేని వారికి ఉన్నట్టు.. ఉన్న వారికి లేనట్టు రిపోర్టులు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు టెస్టింగ్ డేటాను బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 
ఒక్కొక్కరిది ఒక్కో విధానం..
కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు ఇప్పటికీ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేదు. ఒక్కో డాక్టర్ ఒక్కో రకమైన ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నారు. డాక్టర్‌‌‌‌ను బట్టి మందులు మారుతున్నాయి. రెమ్డిసివిర్, ఫాబీఫ్లూ వంటి ట్యాబ్లెట్లు అవసరమని కొందరు, అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఫేస్‌‌బుక్ పోస్టుల్లో చిట్కా వైద్యాలకు కొరతే లేదు. ఇలాంటి తేడాల వల్ల జనం జేబు గుల్ల అవుతోంది. కొందరు డాక్టర్లు కరోనా నిర్ధారణ కోసం రెండు సీటీ స్కాన్లు, రెండు బ్లడ్ టెస్టులు చేయిస్తున్నారు. వీటికి వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు భరించలేని కొందరు యూట్యూబ్ వీడియోలు చూసి, ఎవరో చెప్పిన సలహాలు విని సెల్ఫ్ ట్రిట్‌‌మెంట్‌‌ చేసుకుంటున్నారు. ఇది డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నా వినడం లేదు. రెమ్డిసివర్ వంటి ఇంజెక్షన్, ఆక్సిజన్ ఎక్విప్‌‌మెంట్లు దొరకడం లేదు. బ్లాక్‌‌లో కొనేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. 
కరోనా వల్ల నష్టాలు..
 చాలా మంది ట్రీట్‌మెంట్‌ కోసం దొరికినచోటల్లా అప్పులు చేస్తున్నారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి జబ్బు సోకితే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి.     ఇక ముందు వినియోగం మరింత తగ్గుతుంది. దీంతో చాలా వ్యాపారాలు నష్టపోతాయి. అయితే గోల్డ్ లోన్ వంటి కంపెనీల బిజినెస్ పెరిగే చాన్సులు ఉన్నాయి. 
భయంతో కొనుగోళ్లు 
పెరుగుతున్నాయి. దీనివల్ల సప్లయ్‌ చెయిన్లు దెబ్బతింటాయి. తగినంత సప్లయ్‌లు ఉండవు కాబట్టి ధరల పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి, డాక్టర్లను బట్టి కరోనా ట్రీట్‌మెంట్‌ పద్ధతుల్లో తేడాలుంటున్నాయి. కొందరు డాక్టర్లు కరోనా నిర్ధారణ కోసం రెండు సీటీ స్కాన్లు, రెండు బ్లడ్ టెస్టులు చేయిస్తున్నారు. వీటికి వేల రూపాయలు ఖర్చవుతోంది.