మహబూబ్ నగర్లో బియ్యం ప్లీజ్.. మిల్లర్ల చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు

మహబూబ్ నగర్లో బియ్యం ప్లీజ్.. మిల్లర్ల చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు
  •     పెండింగ్​లో 61 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్
  •     పత్తాలేని విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​  
  •     బియ్యం ఇవ్వని మిల్లులకే తిరిగి వడ్లు ఇవ్వడంపై అనుమానాలు

నాగర్​ కర్నూల్,​ వెలుగు: ప్రభుత్వం నుంచి తీసుకున్న వడ్లు పట్టించి ఎఫ్​సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్​ టార్గెట్​ పూర్తి చేయాలని సివిల్​ సప్లై ఆఫీసర్లు మిల్లుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మిల్లర్లకు ఇచ్చిన వడ్లు, స్టాక్, ఎఫ్​సీఐకి పెట్టిన బియ్యం వివరాలు సేకరించాల్సిన విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2023 ఖరీఫ్, రబీలో కలిపి 1,38,653 మెట్రిక్​ టన్నుల వడ్లు జిల్లాలోని 109 మిల్లులకు ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 42,986 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ ఇచ్చారు.

ఇంకా 49,961 మెట్రిక్​ టన్నుల బియ్యం​రావాల్సి ఉంది. అలాగే 2021 ఖరీఫ్, యాసంగికి సంబంధించి 11,800 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది. ఇదిలా ఉంటే సీఎంఆర్​ ఇవ్వని మిల్లులను బ్లాక్​ లిస్ట్​లో పెట్టడం, పీడీఎస్​ బియ్యం రీసైకిల్​ చేస్తూ పట్టుబడిన మిల్లులపై కేసులు పెట్టాలన్న నిబంధనలున్నా సివిల్​సప్లై ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2021 యాసంగికి సంబంధించి11,800 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ రావాల్సి ఉన్నా, వాటిని పాత బకాయి కింద జమకట్టారు. కల్వకుర్తి ప్రాంతంలోని రెండు మిల్లుల్లో ఒకరి నుంచి 8 వేల మెట్రిక్​ టన్నులు, మరో మిల్లర్​ నుంచి 3,800 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ రెండేండ్ల నుంచి పెండింగ్​లో ఉంది.

పెండింగ్​ ఉన్నా..

గత ప్రభుత్వంలో సివిల్​సప్లై అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తిరిగి వడ్లు కేటాయించేలా చూసుకున్నారు. 2023లో రెండు సీజన్లకు కలిపి  కేవలం 42 శాతం మాత్రమే సీఎంఆర్​ ఎఫ్​సీఐకి చేరింది. ఈ ఏడాదికి సంబంధించి 49,961 మెట్రిక్​ టన్నులు, 2021 యాసంగికి సంబంధించి 11,800 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీనికి ఈ నెల 31 చివరి గడువుగా నిర్ణయించారు. 2022 యాసంగి వడ్లకు సంబంధించిన సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది.

మూడు సీజన్లకు సంబంధించి దాదాపు 61వేల మెట్రిక్​ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, మిల్లులు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. 2022లో జిల్లాలో 53 రైస్​ మిల్లులు ఉంటే, గత ఏడాది ఏకంగా 55 కొత్త మిల్లులు వచ్చాయంటే బియ్యం దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మిల్లర్లకు వడ్లు ఇచ్చిన ప్రభుత్వం సీఎంఆర్​కు అడిగినంత టైం ఇచ్చింది. 

వారానికో మీటింగ్  పెట్టినా..

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పీడీఎస్​ రైస్​ రీ సైక్లింగ్, సీఎంఆర్​పై కఠినంగా వ్యవహరిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి రివ్యూ అయిపోగానే, కలెక్టర్​ ఉదయ్​ కుమార్, అడిషనల్​ కలెక్టర్​ సీతారామరావు వేర్వేరుగా మీటింగ్స్​ పెడుతున్నారు. సివిల్​ సప్లై, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు మిల్లర్లతో మాట్లాడుతున్నారు. గడువులోగా సీఎంఆర్​ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవనే వార్నింగ్​ ఇస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. రెండు నెలల్లో 8 శాతం సీఎంఆర్​ మాత్రమే రాబట్టగలిగారు. ఇదిలాఉంటే 2021 కంటే ముందు పెండింగ్​ సీఎంఆర్​ను లెక్కలు చూపకుండా దాటేస్తున్నారు.