హైదరాబాద్లో ఓ ఆరో తరగతి విద్యార్థిని రాసిన లెటర్ సంచలనంగా మారింది. ఆ లేఖకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. వనస్థలిపురంలోని సామనగర్లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్కు చెందిన R.వైష్ణవి వారి కాలనీలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ తీసేయాలని తెలంగాణ హైకోర్టు CJకి లేఖ రాసింది. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)గా పరిగణించిన హైకోర్టు సంబంధిత అధికారులను వివరణ కోరింది. ప్రధాన కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, హోంశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్, హయత్నగర్ ఇన్స్పెక్టర్తో సహా పలు ఉన్నతాధికారులను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బెంచ్ ఆదేశించింది.
హయత్నగర్, సాహెబ్నగర్ రోడ్డుపై ఉన్న సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని లెటర్ లో రాసింది. బార్ దగ్గర్లో స్కూల్, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సమస్యగా ఉందని వైష్ణవి అన్నది. అంతేకాకుండా చుట్టు పక్కనే ఓ వోల్డ్ ఏజ్ హోమ్, గుడి కూడా ఉందని, కాలనీవాసులందరికి ట్రాఫిక్ సమస్య, ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. బార్ అక్కడ నుంచి తొలగించాలని హైకోర్టు జడ్జిని లేఖలో కోరింది. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని, చర్యలు తీసుకోవాలని హైకోర్టు అధికారులకు టైం ఇచ్చింది.