ఆ దేశాల్లో అనుమతులుంటే చాలన్న డీసీజీఐ
బ్రిడ్జి ట్రయల్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
ఫైజర్, మోడర్నా కంపెనీల టీకాలు వచ్చే చాన్స్
కొవాగ్జిన్ ఫార్ములా హాఫ్కిన్కు ఇచ్చిన భారత్ బయోటెక్
ఏటా 22.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్న హాఫ్కిన్
కెనడా టీకాలూ వచ్చే అవకాశం
ఆ దేశ కంపెనీ ప్రావిడెన్స్తో బయోలాజికల్– ఈ ఒప్పందం
డిసెంబర్ కల్లా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు స్పీడప్
కొవాగ్జిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను హాఫ్కిన్ బయోఫార్మా ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్లు, మహారాష్ట్ర సర్కారు రూ.94 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ రాథోడ్ ప్రకటించారు. కొవాగ్జిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పనులు చకచకా సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత్ బయోటెక్ విధించిన కాన్ఫిడెన్షియల్ క్లాజ్పై సంతకాలు పూర్తయ్యాయని, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవడమే తరువాయి అని తెలిపారు. రెండు దశల్లో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తామని, మొదటి దశలో డ్రగ్ మూల పదార్థాన్ని (డ్రగ్ సబ్స్టెన్స్), ఆ తర్వాత పూర్తి డ్రగ్ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. డ్రగ్ మూల పదార్థ తయారీకి బయో సేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ అవసరమన్నారు. మరో 8 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత నెలకు 2 కోట్ల డోసుల చొప్పున.. ఏడాదిలో 11 నెలలకుగానూ 22.8 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ఇస్తామని ఆయన వివరించారు.
న్యూఢిల్లీ: డిసెంబర్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విదేశీ టీకాలకు లైన్ క్లియర్ చేసేస్తోంది. విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్ అవసరం లేదని ప్రకటించింది. దీంతో అనుమతులకు దరఖాస్తు చేసుకుని వెనక్కు తగ్గిన ఫైజర్, మోడర్నా వంటి కంపెనీలు వీలైనంత తొందరగా దేశంలో టీకాలను తీసుకొచ్చేందుకు అవకాశం దొరకనుంది. ఇటు కెనడా నుంచీ మన దేశానికి కరోనా వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రావిడెన్స్ ఐఎన్సీతో బయోలాజికల్– ఈ ఒప్పందం చేసుకుంది.
ఇప్పటిదాకా విదేశీ కంపెనీల టీకాలను మన దగ్గర వాడాలంటే బ్రిడ్జి ట్రయల్స్తప్పనిసరి. అందులో భాగంగా కనీసం వారం పాటు వలంటీర్లపై వ్యాక్సిన్ను టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టీకా సేఫ్టీ, పనితీరును తెలుసుకున్నాకే దానికి కేంద్రం అనుమతులిచ్చేది. అయితే, ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడం, కేసులు పెరిగిపోతుండడంతో ఎక్కువ వ్యాక్సిన్లను సమీకరించేందుకు ఆ బ్రిడ్జి ట్రయల్స్ను రద్దు చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రకటించింది.
ఫైజర్ నుంచి 6 కోట్ల డోసులు!
డీసీజీఐ బ్రిడ్జి ట్రయల్స్ను రద్దు చేయడంతో 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసుల ఫైజర్ టీకాలు ఇండియాకు రానున్నాయని తెలుస్తోంది. అయితే, ఇండెమ్నిటీ బాండ్పైనే కేంద్ర ప్రభుత్వం, ఫైజర్ కంపెనీల మధ్య పేచీ నడుస్తోంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు తమకు ఆ సౌకర్యం కల్పించాయని, ఇండియా కూడా ఇవ్వాల్సిందేనని ఫైజర్ పట్టుబడుతోంది. కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేమని తేల్చి చెబుతోంది. ఇప్పుడు దేశంలో టీకాలు అత్యవసరం కావడంతో ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాకపోయినా ‘పార్షియల్ ఇండెమ్నిటీ’కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు సమాచారం. పూర్తి ఇండెమ్నిటీ ఇవ్వడం మాత్రం కుదరదని చెప్పినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఫైజర్ ప్రతినిధులు అంటున్నారు.
ఏంటీ ఈ ఇండెమ్నిటీ?
ఇండెమ్నిటీ బాండ్ అంటే సెక్యూరిటీ (రక్షణ) బాండే. మన దేశంలో వ్యాక్సిన్ వికటించి చనిపోయిన వారికి ఆయా కంపెనీలే పరిహారం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయి. తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ వచ్చినా వారికి పరిహారం ఇస్తాయి. ఫైజర్ మాత్రం తాను పరిహారం చెల్లించనని చెప్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. తమకు ఆ హామీతో ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలని పట్టుబట్టింది.
మోడర్నా, ఇతర విదేశీ టీకాలపైనా చర్చలు
ఫైజర్ టీకానే కాకుండా మోడర్నా టీకాలను దిగుమతి చేసుకునే విషయంపైనా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. మోడర్నా కూడా మన దేశంలోకి టీకాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. ఎన్ని డోసులు ఇస్తామన్న దానిపైనే క్లారిటీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కెనడా కంపెనీతో బయోలాజికల్-ఈ జట్టు
వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ కంపెనీ బయోలాజికల్–ఈ ప్రయత్నాలు చేస్తోంది. కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరపెటిక్స్ హోల్డింగ్స్ ఐఎన్సీ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పీటీఎక్స్ కొవిడ్19బీని మన దేశంలో బయోలాజికల్–ఈ ఉత్పత్తి చేయనుంది. 2022 నాటికి 100 కోట్ల డోసుల తయారీ లక్ష్యంతో ఒప్పందం చేసుకుంది. అది సాధ్యం కాకపోతే కనీసం 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఒప్పందంలో భాగంగా ప్రావిడెన్స్ కూడా 3 కోట్ల డోసులను విడతల వారీగా ఇవ్వనుంది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని, వచ్చే ఏడాది ప్రారంభంలో మరికొన్ని ఇచ్చేలా రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు బ్రిడ్జి ట్రయల్స్ ఎత్తేసిన నేపథ్యంలో కెనడా టీకాలూ మనకు త్వరగానే అందే అవకాశం ఉంది. కాగా, ఇటు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా ఉత్పత్తికీ ఇప్పటికే బయోలాజికల్–ఈ ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రొడక్షన్
అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు దేశంలో టీకాల ఉత్పత్తిని క్రమంగా పెంచుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కొవిడ్ సురక్ష కింద.. మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సహకారం అందిస్తోందని పేర్కొంది. మహారాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంబైలోని హాఫ్కిన్ బయోఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, యూపీలోని భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పింది.
ఆ దేశాల్లో ఎకే అయితే చాలు
టీకాలకు డిమాండ్ భారీగా పెరగడంతో విదేశీ టీకాలను వీలైనంత ఎక్కువ తెప్పించేందుకు బ్రిడ్జి ట్రయల్స్ను రద్దు చేశాం. వ్యాక్సినేషన్పై వేసిన నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. యూఎస్ఎఫ్డీఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, బ్రిటన్ మెడికల్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ, జపాన్ ఫార్మాస్యుటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ ఏజెన్సీలు లేదా డబ్ల్యూహెచ్వో అనుమతించిన టీకాలను ఇకపై ట్రయల్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు. టీకా తయారీ దేశాల్లోని నేషనల్ కంట్రోల్ లేబొరేటరీలు సర్టిఫికెట్ ఇస్తే.. ఇక్కడ ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్లను టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ ఆధ్వర్యంలో
నేరుగా టీకాలను విడుదల చేసుకోవచ్చు. - వీజీ సోమానీ, డీసీజీఐ చీఫ్
సినోవ్యాక్కు డబ్ల్యూహెచ్వో అనుమతి
మరో చైనా వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతిచ్చింది. పోయిన నెలలో సినోఫార్మ్ టీకా ఎమర్జెన్సీ వాడకానికి ఓకే చెప్పిన డబ్ల్యూహెచ్వో.. ఇప్పుడు సినోవ్యాక్ టీకాకూ పర్మిషన్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టే ఆ టీకా సేఫ్టీ, పనితీరు, తయారీ ఉందని పేర్కొంది. అన్నింటినీ పరిశీలించే సినోవ్యాక్ టీకాకు అనుమతులు ఇచ్చామని డబ్ల్యూహెచ్వో యాక్సెస్ టు హెల్త్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మేరియేంజెలా సిమావో చెప్పారు.