
- కేటీఆర్ చెప్పిండు..టికెట్ మాకే!
- వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న మంత్రి సన్నిహితులు
- ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటనలు
- కుత్బుల్లాపూర్లో శంభీపూర్ రాజు, జనగామలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
- లిస్టులో ఎంపీ కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరికొందరు
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ సన్నిహితులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ‘రామన్న చెప్పిండు.. టికెట్ మాకే’ అంటూ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు నూరైనా ఈసారి టికెట్తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇంకో ఆరు నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో గ్రామ, మండల స్థాయి నాయకులు, క్యాడర్తో తరచూ సమావేశమవుతూ తమతో కలిసి పని చేయాలని కోరుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ఎమ్మెల్యేలకు టికెట్ఇచ్చేది లేదని పార్టీ చీఫ్ కేసీఆర్హెచ్చరించారని, హైకమాండ్ నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతోనే తాము పోటీకి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు.
ఖానాపూర్ లో భూక్యా జాన్సన్ కర్చీఫ్..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు కుత్బుల్లాపూర్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేటీఆర్కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం ప్రభుత్వం, పార్టీలో కలిపి రాజుకు మూడు పదవులు ఉన్నాయి. పార్టీలో తనకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈసారి టికెట్తప్పకుండా వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. కేటీఆర్ క్లాస్మేట్ భూక్యా జాన్సన్ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్పై ఖర్చీఫ్ వేశారు.
ఈసారి టికెట్తనదేనని, తనతో కలిసి పని చేయాలని నియోజకవర్గ క్యాడర్కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్తో ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరు ముగ్గురు పుణెలో ఉన్నప్పుడు రూమ్మేట్స్. ఈ లైన్లోనే శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు జనగామ టికెట్పై ధీమాతో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కేటీఆర్ కోటాలోనే మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజ లింగం తనయుడు నాగపురి కిరణ్ కుమార్కూడా టికెట్ఆశిస్తున్నారు. లోకల్ కావడం, 50 ఏండ్లుగా నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా ఉండడం తనకు పెద్ద అనుకూలాంశాలని చెప్పుకుంటున్నారు. ఇక కేటీఆర్కు సన్నిహితుడైన గొట్టెముక్కుల వెంకటేశ్వర్ రావు కూకట్పల్లి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేతో సమా నంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
రాజేంద్రనగర్లో మంత్రి సబిత కొడుకు..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సబిత బీఆర్ఎస్లో చేరినప్పుడే ఈ మేరకు ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కార్తీక్ రెడ్డి మంత్రి కేటీఆర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తు న్నారు. హెచ్సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ను గెలిపించడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలకు కార్తీక్ చేయూతనిచ్చారని, దానికి బదులుగా ఈసారి టికెట్ఇప్పిస్తారని ఆయన సన్నిహితులు అంటు న్నారు. మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టికెట్ఖరారు చేశారని, ఇక ప్రకటనే తరువాయి అని ఆమె వర్గీయులు చెబుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ టికెట్ ఆశిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి ఆయన కేసీఆర్, కేటీఆర్తో సన్నిహితంగా ఉంటున్నారు. సిట్టింగ్ఎమ్మెల్యేతో పోటాపోటీగా రామ్మోహన్ నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. టికెట్పై హైకమాండ్ నుంచి నిర్దిష్టమైన హామీ లభించిందని ఆయన సన్నిహితులు చెబుతు న్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. టికెట్పై హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.
మెదక్లో మైనంపల్లి కొడుకు..
మంత్రి సత్యవతి రాథోడ్ అక్క కుమార్తె, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బింధు ఇల్లెందు టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం కేటీఆర్ దగ్గర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ అసెంబ్లీ టికెట్ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్ర మాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పటాన్చెరు టికెట్ నీలం మధు ముదిరాజ్ఆశిస్తు న్నారు. ఆయన సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయనకు టికెట్పై కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా
నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వరంగల్ తూర్పు టికెట్ను మేయర్ గుండు సుధారాణి ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి వైరా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు.
సాగర్లో మూడు ముక్కలాట..
నాగార్జున సాగర్లో టికెట్ కోసం త్రిముఖ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ టికెట్ ఆశిస్తుండగా, మంత్రి జగదీశ్రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి రేసులో ఉన్నారు. తన సమీప బంధువైన మన్నె రంజిత్ కుమార్ యాదవ్కు టికెట్ఇప్పించుకునేందుకు ఎంపీ బడుగుల లింగ య్య యాదవ్ ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ద్వారా రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కోదాడ టికెట్ తనకు ఇవ్వాలని ఎన్ఆర్ఐ జలగం సుధీర్ ఇటీవల కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐదేండ్లకు పైగా కోదాడలోనే ఉన్న సుధీర్ నెల క్రితమే అమెరికా తిరిగి వెళ్లిపోయారు. కేటీఆర్ ఇటీవలి లండన్, అమెరికా పర్యటనల్లో పలువురు ఎన్ఆర్ఐలు ఆయనను కలిసి తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టికెట్పై హామీ ఇవ్వలేనని, ఇతర అవకాశాలిస్తానని వారిలో కొందరికి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.