1. యూఎస్ మార్కెట్ మంగళవారం సెషన్లో నష్టాల్లో క్లోజయ్యింది. నాస్డాక్ 0.43 శాతం, డోజోన్స్ 0.33 శాతం పడిన విషయం తెలిసిందే. దీన్ని ఫాలో అవుతూ మన మార్కెట్ కూడా బుధవారం సెషన్లో నష్టాల్లో ఓపెన్ అయ్యింది. యూఎస్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ తగ్గించడం సెషన్ మధ్యలో బయటకొచ్చింది. దీని తర్వాత ఆసియా మార్కెట్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్, చైనా మార్కెట్స్ 2 శాతం చొప్పున క్రాష్ అయ్యాయి. యూఎస్ మార్కెట్స్ బుధవారం సెషన్లో రెండు శాతం వరకు పడ్డాయి.
2. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికరంగా రూ.1.5 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. తాజాగా ఎఫ్ఐఐలు తమ ఇన్వెస్ట్మెంట్లకు బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. కిందటి సెషన్లో వీరు నికరంగా రూ.93 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
3. నిఫ్టీ వరుసగా ఐదో నెల అయిన జులైలో కూడా లాభాల్లో ముగిసింది. గత ఐదు నెలల్లో ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ 13 శాతం పెరిగింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నారు. మార్చి కనిష్టాల నుంచి నిఫ్టీ ర్యాలీ చేస్తూ వచ్చిందని, గరిష్టాల దగ్గర ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు.
4. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్ ర్యాలీ చేస్తుండడంతో మార్కెట్ వాల్యుయేషన్ కూడా గరిష్టాలకు చేరుకుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి నుంచి మరింతగా పెరగడానికి అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. నిఫ్టీ ప్రస్తుతం తన 12 నెలల పార్వార్డ్ పీఈకి 18.8 రెట్లు ఎక్కువతో ట్రేడవుతోందని, ఈ ఇండెక్స్ లాంగ్ టెర్మ్ యావరేజ్ 16 రెట్లు అని యాక్సిస్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
5. క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ డౌన్గ్రేడ్ చేసిన తర్వాత యూఎస్ బాండ్ ఈల్డ్స్ కొంత తగ్గినా, రికవరీ అవ్వగలిగాయి. యూఎస్ ప్రభుత్వం బాండ్లను ఇష్యూ చేయడాన్ని పెంచుతుందని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారు. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4 శాతం పైన ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 36 పైసలు తగ్గి 82.85 దగ్గర సెటిలయ్యింది.
6. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 20 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ (ఎస్ఎంఏ) కింద క్లోజయ్యింది. డైలీ చార్ట్లో పెద్ద రెడ్ క్యాండిల్ను ఏర్పరిచింది. ఇది నెగెటివ్ సంకేతాలను ఇస్తోంది. ‘నిఫ్టీకి 19,450 సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ పైన కదిలేంత వరకు 19,580–19,600 వరకు పుల్బ్యాక్ ర్యాలీ చూడొచ్చు. 19,450 కిందకి పడితే 19,400–19,375 వరకు పడొచ్చు’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ వివరించారు.
ఫిచ్ ఏం చెప్పిందంటే..
యూఎస్ ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతోందని, అప్పులు విపరీతంగా పెరిగాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. 2012 రిపోర్ట్ ప్రకారం, ఏడాదికి అప్పులపై యూఎస్ ప్రభుత్వం 1.3 ట్రిలియన్ డాలర్లను వడ్డీ కింద ఖర్చు చేస్తోందని పేర్కొంది. సావరిన్ రేటింగ్ను ఏఏఏ నుంచి ఏఏ+ కి తగ్గించింది. రేటింగ్ డౌన్గ్రేడ్ అయితే తీసుకోబోయే అప్పులపై యూఎస్ ప్రభుత్వం ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఫిచ్ ఇచ్చిన రేటింగ్పై యూఎస్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్యాక్స్లు తగ్గించడం, కొత్త ఖర్చులు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో యూఎస్ బడ్జెట్ డెఫిసిట్ పెరిగిపోతోందని ఫిచ్ వ్యాఖ్యానించింది. ఇంకో మూడేళ్ల వరకు డెఫిసిట్ అధ్వాన్నంగానే ఉంటుందని పేర్కొంది. యూఎస్ బాండ్స్ సేఫ్, సెక్యూర్ అనే విషయాన్ని ఫిచ్ రేటింగ్ మార్చలేదని యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది.